జగన్పై దాడి, ఆపరేషన్ గరుడ: బీజేపీ, పవన్, జగన్, కేసీఆర్ కుట్రేనంటూ ఏపీ మంత్రులు
Recommended Video

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్పై దాడిని ఖండిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కానీ ఘటనను రాజకీయంగా పులిమి లబ్ధి పొందాలనుకుంటే ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమని ఆయన చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇది ఆపరేషన్ గరుడలోని ప్లానింగ్ మంత్రి అన్నారు.

శివాజీ చెప్పినట్లే.. ఆపరేషన్ గరుడ
ఆపరేషన్ గరుడ వీడియో చూస్తే ప్రతిఒక్కరికి అర్థమవుతుందని అచ్చెన్నాయుడు అన్నారు. ‘రెండుసార్లు రెక్కీ చేసి.. మూడోసారి ప్రాణాపాయం లేని పొటు పొడుస్తారని ఆపరేషన్ గరుడలో ఉంది. శివాజీ చెప్పినట్లే జరుగుతున్నాయి. ఘటన జరిగిన రెండు నిమిషాలకే గవర్నర్ నరసింహన్ ఢిల్లీ నుంచి తాను తీవ్రంగా పరిగణనిస్తున్నాని, రిపోర్టు డీటేల్డ్గా కావాలని అడగటమేంటి?. దాడి చేసిన మనిషి దొరకకపోతే విమర్శించొచ్చు. ఆ వ్యక్తి వైసీపీ అభిమాని అని చెబుతున్నా టీడీపీని విమర్శిస్తున్నారు' అని మండిపడ్డారు.

బీజేపీ, వైసీపీ, జనసేన, టీఆర్ఎస్ కుట్రే..
‘మీ విమర్శలను స్వీకరిస్తాం.. కానీ దాడి చేసిన వ్యక్తి మాత్రం వెనకేసుకురాం. మీ అభిమాని మిమ్మల్ని ఎందుకు పొడిచాడో తెలియదు. ఆ విషయం దర్యాప్తులో తేలుతుంది. జగన్ అప్రమత్తంగా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని వైసీపీ, జనసేన, బీజేపీ, టీఆర్ఎస్ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాయి' అని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.

టీడీపీపై ఆరోపణలా?
మరో మంత్రి నక్కా ఆనంద్ బాబు కూడా దాడి ఘటనపై స్పందించారు. వైసీపీ అధ్యక్షుడిపై దాడి విషయంలో వైసీపీ నేతలు టీడీపీపై ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి నక్కా ఆనంద్బాబు అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే నీచమైన చరిత్ర తమకు లేదన్నారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఇటువంటి దాడులను ఎప్పుడూ ప్రోత్సహించలేదని మంత్రి చెప్పారు.

ఆపరేషన్ గరుడ నమ్మాల్సిందేనా?
జైళ్లలో రిమాండ్లో ఉన్న ఖైదీలను చంపించిన ఘనత వైసీపీకే ఉందని ఆనంద్ బాబు ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేసి సానుభూతికి ప్రయత్నిస్తున్నారని, ఏ పార్టీ నాయకులు ఎలాంటి వారో ప్రజలకు తెలుసని ఆనంద్ బాబు అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ చేపడుతోందని.. విచారణలో వాస్తవాలు కచ్చితంగా బయటకు వస్తాయని మంత్రి వివరించారు. ఇలాంటి ఘటనలతో సినీనటుడు శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ నిజమేనేమో అని నమ్మాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.

అనుమానాలకు తావిస్తోంది..
కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగంగా ప్రముఖ నాయకుడిపై దాడి జరుగుతుందని శివాజీ చెప్పారని గుర్తు చేశారు. విమానాశ్రయాల్లో భద్రత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటున్నందున అనేక అనుమానాలకు తావిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అనుమానాల నివృత్తికి సమగ్ర విచారణ జరుగుతుందని మంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications