దరిద్రం ఎప్పుడు పోతుందో: బాబుపై కొడాలి నాని
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుష్టపాలన సాగుతోందని, ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందా ఆని ప్రజలు చూస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం అన్నారు. గుడివాడ ఆర్డీవో కార్యాలయం వద్ద నాని ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లోటు బడ్జెట్ అని తెలిసి కూడా అమలు కానీ హామీలు ఇచ్చి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మభ్యపెట్టిందన్నారు. ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన పయ్యావుల కేశవ్ నామినేట్ పదవి కోసం చంద్రబాబును స్తుతిస్తున్నారన్నారు.
ప్రజల కష్టాలు తీరాలి: చంద్రబాబు
నూతన రాష్ర్టానికి తొలి బడ్జెట్ రూపొందిస్తున్నామని, హామీలు నిలుపుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని, మనం చేసే పనుల వల్ల ప్రజల కష్టాలు తీరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. ఏపీలో వంద శాతం ఆధార్ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.
ప్రభుత్వ పథకాలన్నింటికీ ఆధార్ను అనుసంధానం చేయాలన్నారు. విశాఖను అతలాకుతలం చేసిన హుధుద్ తుఫాన్ను రాష్ట్ర ప్రభుత్వం సమర్ధంగా ఎదుర్కొందన్నారు. నూతన రాజధాని నిర్మాణం కోసం యాక్షన్ప్లాన్ ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఎర్రచందనం అమ్మకం ద్వారా రూ. 750 కోట్ల ఆదాయం లభించిందని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో జీరోబేస్డ్ బడ్జెట్: యనమల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2015-16 ఆర్థిక సంవత్సరానికి జీరోబేస్ట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. ప్రజలపై పన్నులు వేయకుండా పనులు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ఆదాయం తక్కువైనా పనులు ఎక్కువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందించడంతోపాటు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం మెరుగైన బడ్జెట్ను రూపొందిస్తున్నామని యనమల వివరించారు.