దళిత యువతిని హతమార్చిన వెధవ చంద్రబాబు లాంటివాడే , లోకేష్ తో లుచ్చా పనులు : కొడాలి నాని ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రేమోన్మాది చేతిలో దళిత యువతి రమ్య హత్యకు గురైన ఘటన చిలికి చిలికి గాలివానగా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగాయని, బాలికలకు రక్షణ కరువైందని తెలుగు తమ్ముళ్లు ధ్వజమెత్తుతున్నారు. దిశా వంటి చట్టాలను తీసుకు వచ్చామని ప్రభుత్వం చెబుతున్నా ఆ చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శిస్తున్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశా చట్టాన్ని అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్నారని టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు.

దళిత యువతి చనిపోతే లోకేష్ శవ రాజకీయాలు
ఆడపిల్లలకు ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేదని, అన్యాయంపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఇదేం అరాచక ప్రభుత్వం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే . ఇక తాజాగా దళిత మహిళ చనిపోతే లోకేశ్ శవ రాజకీయాలు చేస్తున్నాడని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని లోకేష్ ను టార్గెట్ చేస్తూ విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు రమ్య కుటుంబాన్ని ఎందుకు పరామర్శించే లేదో ప్రశ్నించాలన్నారు కొడాలి నాని. బాధిత కుటుంబాన్ని జగన్ పరామర్శించలేదని లోకేష్ చేసిన వ్యాఖ్యలకు మండిపడ్డారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ సీఎంకు సవాల్ విసరటం ఏమిటని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

లోకేష్ హైడ్రామా అందుకే
ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించడం కోసమే లోకేష్ ను పంపి హైడ్రామా చేయించారని చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శించారు. జగనన్న విద్య కానుక కార్యక్రమాన్ని పక్కదారి పట్టించడం కోసం లోకేష్ డ్రామాలాడుతున్నారని, అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని ద్వజమెత్తారు కొడాలి నాని. ఎక్కడో సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తి దారుణానికి పాల్పడితే నిందితుడిని పోలీసులు 12 గంటలలోపే అరెస్ట్ చేశారని, అయినా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కొడాలి నాని ధ్వజమెత్తారు.

లోకేష్ తో లుచ్చా కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం
14 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన చంద్రబాబు లోకేష్ తో లుచ్చా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టించాడు అని తీవ్రపదజాలంతో ద్వజమెత్తారు. దళిత యువతిని హతమార్చిన వెధవ, చంద్రబాబు లాంటి వాడేనని కొడాలి నాని పోల్చారు. ఇక ఈ ఘటన ను ముఖ్యమంత్రికి అంటగడుతున్నారు అంటూ తీవ్రస్థాయిలో కొడాలి నాని చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేశారు. అంతేకాదు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసి తట్టుకోలేక ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారని నిప్పులు చెరిగారు కొడాలి నాని.

మంగళగిరిలో ఓడిన లోకేష్ కు సీఎంకు సవాల్ విసిరే స్థాయి లేదు
మహిళలపై దాడులు జరగకూడదనే ఉద్దేశ్యంతోనే దిశ చట్టాన్ని, దిశ యాప్ ను తీసుకువచ్చామని పేర్కొన్న కొడాలి నాని మహిళలపై దాడులకు పాల్పడే నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దిశ చట్టంలో చిన్నచిన్న లోపాలుంటే సవరించి మరింత కఠినంగా చట్టాన్ని అమలు చేస్తామని చెప్పిన కొడాలి నాని రాష్ట్రంలో ఆడపడుచులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మంగళగిరిలో ఓటమిపాలైన లోకేష్ కు సీఎంకు సవాల్ విసిరే స్థాయి లేదని, ప్రతిపక్ష నేతగా బాధిత కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదో లోకేష్ ముందు తన తండ్రిని నిలదీయాలని పేర్కొన్నారు.

వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు దళిత యువతిని పొడిచిన వాడికి తేడా లేదు
గతంలో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కు, ఇప్పుడు దళిత యువతిని పొడిచిన నిందితుడికి తేడా లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లాంటి వ్యక్తులను జైలుకు పంపిస్తే, అంతమొందిస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దళిత మహిళ చనిపోతే లోకేష్ శవంతో రాజకీయాలు చేయడానికి వెళ్లాడని నిప్పులు చెరిగారు. విద్యారంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంస్కరణలు తీసుకు వచ్చారని, ఓట్లు లేకపోయినా విద్యార్థులకు అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఓర్వలేక ఇలాంటి చిల్లర పనులకు శ్రీకారం చుట్టారని చంద్రబాబు, లోకేష్ లపై ధ్వజమెత్తారు కొడాలి నాని.












Click it and Unblock the Notifications