సాయిరెడ్డి -సజ్జల అక్కడే పరిమితం : కొడాలి - పెద్దిరెడ్డికి కీలక బాధ్యతలు : సీఎం జగన్ నిర్ణయం..!!
ముఖ్యమంత్రి జగన్ పార్టీలో సంస్థాగత పదవుల పంపకం పైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తున్న సీఎం జగన్..ఇప్పటికే కీలకమైన కేబినెట్ విస్తరణ పూర్తి చేసారు. ఇప్పుడు పార్టీ పైన ఫోకస్ పెట్టారు. మంత్రి పదవులు కోల్పోయిన సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని గతంలోనే స్పష్టం చేసారు. గత కేబినెట్ లో పని చేసిన 11 మందికి తిరిగి మంత్రులు ఛాన్స్ ఇవ్వటంతో..మిగిలిన 14 మందికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని భావించారు. అయితే, సీనియర్లుగా మంత్రి పదవులు దక్కించుకున్న వారిలో బొత్సా ..పెద్దిరెడ్డికి పార్టీ బాధ్యతల్లోనూ కీలక స్థానాలు అప్పగించేందు కు రంగం సిద్దమైంది.

సీనియర్లకు కీలక జిల్లాల కేటాయింపు
కొత్త జిల్లాల ప్రకటన ద్వారా 26 జిల్లాలకు...పాత జిల్లాలను రీజియన్లుగా ఖరారు చేస్తూ పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగా.. ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర రీజియన్ ఇన్ ఛార్జ్ గా ఉన్న విజయ సాయిరెడ్డి ఇక నుంచి పార్టీ అనుబంధ విభాగాలు..ఢిల్లీ సంబంధాలకు పరిమితం కానున్నారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం - శ్రీకాకుళం జిల్లాల బాధ్యత సీనియర్ మంత్రి బొత్సాకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. విశాఖ నగర బాధ్యతలు ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కి ఇస్తారని తెలుస్తోంది. అయితే, ఆయనకు తూర్పు గోదావరి ఇన్ ఛార్జ్ గా నియామకం ఖాయమైంది. దీంతో పాటుగా విశాఖ అప్పగింత..లేకుంటే, కురసాల కన్నబాబు - పేర్ని నానిల్లో ఒకరికి వైజాగ్ బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్దమైందని సమాచారం.

సాయిరెడ్డి - సజ్జలకు బాధ్యతల మార్పు
గత ఎన్నికల్లో విశాఖ నగరం నుంచి టీడీపీ నాలుగు స్థానాలు గెలిచింది. విశాఖను వైసీపీ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తామని చెప్పినా..న్యాయ పరమైన చిక్కులతో అమలు కాలేదు. దీంతో..అక్కడ వచ్చే ఎన్నికలను వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. వైసీపీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డికి కీలకమైన పశ్చిమ గోదావరి జిల్లా బాధ్యతలు కేటాయిస్తూ సీఎం నిర్ణయించినట్లు సమాచారం. మంత్రిగా పనిచేసిన వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నానికి టీడీపీ బలంగా ఉందని భావిస్తున్న కృష్ణా, గుంటూరు జిల్లాల బాధ్యతలు అప్పగించనున్నారు. అమరావతి పైన వైసీపీ ప్రభుత్వ నిర్ణయం..సామాజిక వర్గాల ప్రభావం ఆధారంగా ఆ రెండు జిల్లాల బాధ్యతలను కొడాలి నానికి కేటాయించారు. అయితే, పల్నాడు జిల్లాలోని సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని సీనియర్ నేత మోపిదేవికి పల్నాడు జిల్లా కేటాయించనున్నారు.

కొడాలి నాని - మిథున్ రెడ్డి సమర్ధతకు సవాల్ గా
మరో సీనియర్ నేత బాలినేని శ్రీనివాస రెడ్డికి ఆయన సొంత జిల్లా ప్రకాశం తో పాటుగా.. కొద్ది రోజులుగా పార్టీలో చర్చకు కారణమైన నెల్లూరు జిల్లా బాధ్యతలను ఖరారు చేసారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కర్నూలు తో పాటుగా కడప జిల్లాల బాధ్యతలను కేటాయించారు. ఇక, చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుతో పాటుగా టీడీపీ - వైసీపీలకు రాయలసీమ ప్రాంతంలో కీలకమైన అనంతపురం జిల్లా బాధ్యతలను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఖరారు అయింది. ఇక, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలకు జిల్లాల బాధ్యతలు కాకుండా.. రాష్ట్ర సమన్వయకర్తగా పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి పని చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక, మాజీ - తాజా మంత్రుల్లోనూ కొందరికి కొత్త జిల్లాల ఆధారంగా పార్టీ బాధ్యతలు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ రోజు సీఎం జగన్ విశాఖ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన తిరిగి తాడేపల్లి చేరుకున్న తరువాత ఈ జాబితాకు తుది ఆమోదం తెలపనున్నారు. అనంతరం పార్టీ అధికారికంగా ఈ జాబితాను విడదుల చేయనుంది.












Click it and Unblock the Notifications