పిచ్చి కార్యక్రమాలొద్దు.! గుడివాడే కాదు, ఏపీ ప్రజలూ క్షమించారు: పురంధేశ్వరిపై కొడాలి నాని
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరిపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గుడివాడ పురపాలక సంఘం కార్యాలయంలో కొడాలి నాని సోమవారం మీడియాతో మాట్లాడారు.
చెడగొట్టే కార్యక్రమాలు వద్దంటూ కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న పురందేశ్వరి అడ్డుకుంటున్నారని కొడాలి నాని ఆరోపించారు. అన్న ఎన్టీఆర్ రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. చెడగొట్టే కార్యక్రమంలో పురంధేశ్వరి పాలు పంచుకోకూడదని అన్నారు.
ఎన్టీఆర్ కుమార్తెగా ఇది సరికాదంటూ పురంధేశ్వరిపై కొడాలి నాని
కొన్ని వ్యాపార సంస్థల ప్రయోజనాల కోసం ఫ్లైఓవర్ల నిర్మాణంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అపాయింట్మెంట్ను పురంధేశ్వరి అడిగారని కొడాలి నాని చెప్పారు. గుడివాడ వచ్చి మీటింగ్ పెడితే.. ఎవరైనా ఫ్లైఓవర్లు వద్దంటే అప్పుడు క్యాన్సిల్ చేయించండని అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. పది మంది కోసం, ఒక పార్టీ ప్రయోజనాల కోసం ఇంతమంది ప్రజలను ఇబ్బంది పెడతారా? అంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుమార్తెగా మీకు ఇది సరికాదని అన్నారు.
పురంధేశ్వరివి పిచ్చి ప్రయత్నాలంటూ కొడాలి నాని వార్నింగ్
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఎంపీ వల్లభనేని బాలశౌరిల కృషితో గుడివాడ ప్రజల సుదీర్ఘ సమస్య అయిన రైల్వే గేట్లపై ఫ్లైఓవర్లు మంజూరు అయ్యాయి. కేవలం 10 మంది వ్యాపారుల ప్రయోజనాల కోసం లక్షలాది మందికి ఉపయోగపడే ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని అడ్డుకోవడం దారుణం. ఫ్లైఓవర్ నిర్మాణం ఆగిపోతే గుడివాడ మీదుగా వెళ్లే రైళ్లను అడ్డుకుంటాం. పురందేశ్వరి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలి. ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని అడ్డుకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని కొడాలి నాని హెచ్చరించారు.
ఏపీ ప్రజలు క్షమించరంటూ పురంధేశ్వరిపై కొడాలి నాని
మీరు ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని పనికిమాలిన వాళ్లు వచ్చి మిమ్మల్ని కలిస్తే వాళ్ల తరుఫున మీరు గడ్కరీని కలిసి నిర్మాణాలను క్యాన్సిల్ చేయించడానికి ప్రయత్నిస్తున్నారంటే.. ఈ గుడివాడ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలూ మిమ్మల్ని క్షమించరు అని పురంధేశ్వరిపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, పురంధేశ్వరిపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.