కొడాలి, వంశీలకు ఎదురుగాలి ! భువనేశ్వరి ఎపిసోడ్ తో బ్యాడ్-రాధా వైసీపీలోకి వస్తే ?
ఏపీలో రాజకీయంగా అత్యంత క్రియాశీలకంగా ఉండే కృష్ణాజిల్లాలో ఇప్పుడు వైసీపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీలో ఉన్న వంగవీటి రాధాను వైసీపీలోకి తెచ్చేందుకు ఇక్కడి మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు పోటీ చేసి ఓటమిపాలైన రాధాను పట్టుబట్టి వైసీపీలోకి తీసుకురావడం వల్ల నిజంగానే పార్టీకి ప్రయోజనం ఉందా అంటే అదీ లేదు. కానీ వీరిద్దరికీ ప్రయోజనం ఉందా అంటే అవుననే అంటున్నాయి కృష్ణాజిల్లా పొలిటికల్ వర్గాలు.

కృష్ణాజిల్లా రాజకీయం
ఏపీలో కృష్ణాజిల్లా రాజకీయాలకు ఓ ప్రత్యేకత ఉంది. గతంలో ఎన్టీఆర్ వంటి ముఖ్యమంత్రితో పాటు పలువురు రాజకీయ నేతల్ని రాష్ట్రానికి పరిచయం చేసిన జిల్లా ఇది. అయితే ఇక్కడ బలమైన కమ్మ సామాజిక వర్గానికి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో చుక్కలు కనిపిస్తున్నా ఇక్కడి వైసీపీ నేతలకు మాత్రం అలాంటి ఇబ్బంది లేదు. దీనికి కారణం వారు అధికార పార్టీలో ఉండటంతో పాటు విపక్ష టీడీపీపై విరుచుకుపడుతుండమే. అయితే ఇదే క్రమంలో వారికి ప్రజా వ్యతిరేకత కూడా అదే స్ధాయిలో పెరుగుతోంది. రేపు రాబోయే ఎన్నికల్లో ఇదే జనంతో ఓట్లు వేయించుకోవడం కష్టంగా పరిస్ధితులు మారుతున్నాయి.

గుడివాడలో నానిపై వ్యతిరేకత
గుడివాడ నియోజకవర్గం నుంచి ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న కొడాలి నానికి ఈసారి మాత్రం వ్యతిరేకత తప్పడం లేదు. ముఖ్యంగా గతంలో కమ్మసామాజిక వర్గ ఓట్లతో పాటు కాపుల మద్తతు కూడా తోడవడంతో సునాయాసంగా గెలుస్తూ వస్తున్న కొడాలి నానికి ఈసారి మాత్రం ప్రతికూల పరిస్ధితులు తప్పడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆయన ప్రత్యర్ధులపై చేస్తున్న దూషణలే. తాజాగా చంద్రబాబుపై, ఆయన సతీమణి భువనేశ్వరిపై అసెంబ్లీ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో స్ధానికంగా కమ్మ సామాజిక వర్గం దూరమయ్యే పరిస్ధితి వచ్చేస్తోంది. అదే సమయంలో మిగతా సామాజిక వర్గాల మద్దతు కూడా అంతంత మాత్రంగానే ఉంది.

గన్నవరంలో వంశీ ఎదురీత
అలాగే గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ.. ఆ తర్వాత పార్టీ ఫిరాయించి వైసీపీలో కొనసాగుతున్నారు. దీంతో ఆయనకు కొన్నేళ్లుగా అండగా నిలుస్తూ వస్తున్న కమ్మ సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలు కూడా దూరమవుతున్నాయి. అదే సమయంలో తన స్నేహితుడు కూడా అయిన మంత్రి కొడాలినానితో సమానంగా ప్రత్యర్ధి టీడీపీ నేతలపై ఆయన నోరు పారేసుకుంటున్న వైనం వంశీకి స్ధానికంగా వ్యతిరేకత పెంచుతోంది. తాజాగా చంద్రబాబు సతీమణిపై ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు సొంత పార్టీలో సైతం వ్యతిరేకత పెంచాయి. అసలే టీడీపీలో 800 ఓట్ల తేడాతో గెలిచిన వంశీకి ఇప్పుడు వైసీపీ తరఫున గెలుపు మరింత కష్టంగా మారిపోతోంది.

రాధా మద్దతు కోసం నాని, వంశీ పాట్లు
పక్కపక్కనే ఉన్న గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపుల జనాభా కూడా అధికంగా ఉంది. వీరి ఓట్లు ప్రతీ ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే గత ఎన్నికల్లో సైతం టీడీపీకి మద్దతుగా ఉన్న కాపుల జనాభా ఓట్లతోనే వంశీ గట్టెక్కారని కూడా చెబుతారు. ఇలాంటి పరిస్దితుల్లో చంద్రబాబు, భువనేశ్వరిపై విచ్చలవిడి కామెంట్లతో నాని, వంశీపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా పెరిగినట్లు తెలుస్తోంది. దీన్ని అధిగమించేందుకు కాపు సామాజికవర్గ నేతగా ఉన్న రాధాను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు వీరిద్దరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాధా పార్టీలో చేరితే తన కాపు సామాజికవర్గ ఓట్లు తమ ఖాతాలో పడినట్లేనని భావిస్తున్న వంశీ, నానీ ఆయన కోసం చేయని ప్రయత్నం లేదు. అయితే తాజాగా రంగా విగ్రహావిష్కరణ పెట్టి రాధాను ఆహ్వానించినా ఆయన చేసిన రెక్కీ వ్యాఖ్యలతో మొత్తం పరిస్దితి మారిపోయింది. చివరికి రాధాకు వైసీపీ ప్రభుత్వం భద్రత ఇచ్చినా ఆయన తిరస్కరించారు. చివరికి వైసీపీని కాదని టీడీపీ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. దీంతో కొడాలి నాని, వల్లభనేని వంశీకి నిరాశ తప్పడం లేదు.












Click it and Unblock the Notifications