'జగన్ ఆ పంజరంలో చిలుకే': కోదండ, కెటిఆర్ హెచ్చరిక
తెలంగాణపై సీమాంధ్ర పెత్తనం కోసమే జగన్ హైదరాబాదులో సమైక్య సభ పెడతామని చెబుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల మనోభావాలను అనుగుణంగా జగన్ సభను విరమించుకోవాలన్నారు. సమైక్యవాదులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవద్దని కోరారు. జగన్ సభ పెట్టి తెలంగాణ ప్రజల హక్కులు కాలరాస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
తెలంగాణ భవన్లో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి కెటిఆర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీమాంధ్రుల నోట్ల కట్టలకు తెలంగాణ నోట్ ఆగిందా అనే అనుమానం తెలంగాణ ప్రజలలో కలుగుతోందని విమర్శించారు.
తాము మహాత్ముడు చూపిన అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామన్నారు. హైదరాబాదులో కొందరు సమైక్య సభ పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అయినా తాము సంయమనం పాటిస్తామని వైయస్ జగన్ను ఉద్దేశించి అన్నారు. నెలాఖరులోగా శాసన సభకు బిల్లు రాకపోతే పరిస్థితి సంక్లిష్టంగా మారుతుందన్నారు.
కాంగ్రెసు పంజరంలో చిలుకే: మందకృష్ణ ఫైర్
వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీ పంజరంలోని చిలుకేనని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వేరుగా అన్నారు. డీల్లో భాగంగానే ఆయనకు బెయిల్ వచ్చిందని ఆరోపించారు. మళ్లీ జైలు పాలవుతాననే భయంతో జగన్ అధిష్టానంతో డీల్ కుదుర్చుకున్నారని విమర్శించారు. తెలంగాణ ద్రోహులంతా తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చుట్టే ఉన్నారన్నారు.