కిరణ్ రెడ్డి సైకో: కోమటిరెడ్డి, కాంగ్రెస్కు శని: జీవన్ రెడ్డి
హైదరాబాద్/ నల్లగొండ : మంత్రి శ్రీధర్ బాబు శాఖను మార్చడంపై తెలంగాణ కాంగ్రెసు నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిపై మాజీ మంత్రి జీవన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్కు పట్టిన శని అని విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి పోతే కాంగ్రెస్ బాగుపడుతుందని జీవన్రెడ్డి గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
సీమాంధ్ర నేతల చేతిలో అధికారముంటే ఎలా దుర్వినియోగమవుతుందో తేలిపోయిందని తెలంగాణకు చెదిన రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విడిపోడానికి శ్రీధర్బాబు ఉదాహరణ చాలునని ఆయన అన్నారు. కిరణ్కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని సారయ్య వ్యాఖ్యానించారు.
కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైకోగా అభివర్ణించారు. ఆయన నల్లగొండలో గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కిరణ్ కుమార్ రెడ్డిని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని ఆయన అన్నారు. మంత్రి శ్రీధర్ బాబుకు జరిగిన అవమానానికి తెలంగాణ మంత్రులు రాజీనామా చేయాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాడిస్టులా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శానససభలో సమైక్య తీర్మానం పెడితే యుద్ధవాతావరణమే ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణను కిరణ్ కుమార్ రెడ్డి కాదు, ఆయన తాత కూడా ఆపలేరని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
శ్రీధర్ బాబు శాఖ మార్పు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. శాఖ మార్పుతో తెలంగాణ ప్రక్రియను ఆపాలనుకోవడం అవివేకమని, తెలంగాణ ప్రక్రియను అడ్డుకునే హక్కు అసెంబ్లీకి లేదని ఆయన గురువారం మహబూబ్నగర్లో మీడియా ప్రతినిధులతో అన్నారు.