జగన్పై బాబుతో జెపి పోటీ, ఏం ఆశిస్తున్నారు: కొణతాల
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన దుష్ప్రచారం చేయడంలో లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు, కూకట్పల్లి శాసన సభ్యుడు జయప్రకాశ్ నారాయణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పోటీ పడుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మండిపడ్డారు.
రాజకీయ దుష్టక్రీడలో జెపి ఓ పావుగా మారారనిపిస్తోందని కొణతాల అన్నారు. జగన్ బయటకు రావడంతో కొన్ని పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్డులో విచారిస్తే జగన్ త్వరగా నిర్దోషిగా బయటకు వస్తారన్నారు. టిడిపి, బిజెపి, లోక్సత్తాలు ఏమి ఆశించి జగన్ పైన దుష్ప్రచారం చేస్తున్నాయో చెప్పాలన్నారు.
జెపి, నిర్మలా సీతారామన్ పైన సోమయాజులు
దర్యాఫ్తు పూర్తయిందని సిబిఐ చెప్పినందువల్లనే జగన్కు బెయిల్ వచ్చిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సోమయాజులు అన్నారు. జగన్ ప్రజాదరణ చూసి టిడిపికి బాధేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. దర్యాఫ్తు పూర్తి కాలేదని చెప్పినంత కాలం జగన్కు బెయిల్ రాలేదని, పూర్తయిందని చెప్పాకనే బెయిల్ వచ్చిందన్నారు.
సుప్రీం కోర్టు గడువు విధించడంతో సిబిఐ దర్యాఫ్తును ముగించిందని, దానిని అందరు గుర్తించాలన్నారు. తాము కాంగ్రెసుతో కలిసిపోయామని బిజెపి అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ చెప్పడం విడ్డూరమన్నారు. జగన్ను కాంగ్రెసు వేధిస్తోందని ఆ పార్టీ నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలో గతంలో చెప్పారని గుర్తు చేశారు.
సుష్మ చెప్పిన విషయం నిర్మలకు తెలియదా చెప్పాలన్నారు. జయప్రకాశ్ నారాయణ తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ ఆస్తులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు కోరిన జెపి.. అలాగే చంద్రబాబు నాయుడు హయాంలోని అవినీతి పైన కూడా సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తారా అని ప్రశ్నించారు.