జగన్, కెసిఆర్లకు అప్పుడే సిఎం ఫీలింగ్: యాక్టర్ కోట

జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రావులు అప్పుడే ముఖ్యమంత్రులు అయిపోయామని అనుకుంటున్నట్లు కోట శ్రీనివాసరావు అన్నారు. దేశంలోనే జగన్ అత్యంత అవినీతి పరుడని, అతన్ని ముఖ్యంమంత్రి కాకుండా చూడాలని ఆయన రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఆంధ్రావాళ్లను ఉద్దేశించి జాగో బాగో అనడం సరికాదని అన్నారు. అలా అనడానికి ఆయనేమైనా ముఖ్యమంత్రా అని కోట ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పాటు కోసమే తాము పార్టీ పెట్టామంటున్న కేసీఆర్, తెలంగాణ కోసం కలలు కనడం తప్ప మరేమి చేయలేదని కోట శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కూడా కోట శ్రీనివాసరావు మండిపడ్డారు. ఎన్నికల్లో పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలంటే రూ. 16 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని చంద్రబాబు అనడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఖర్చు చేసే ఆ సొమ్ము ప్రజలకేమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు.
తన సొంత పార్టీ బిజెపిపై కూడా కోట శ్రీనివాసరావు కొంత అసహనం వ్యక్తం చేశారు. బిజెపి నాయకులు ప్రజలకు మంచి చేయాలని అనుకుంటారని..అయితే ఆచరణలో మాత్రం ముందుకు వెళ్లలేక పోతున్నారని అన్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్లనే గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. కానీ ఎప్పుడూ పార్టీని వీడి వెళ్లలేదని అన్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన సభకు హాజరైన గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కోట శ్రీనివాసరావు కలిశారు. గతంలో కోట శ్రీనివాసరావు విజయవాడ నుంచి బిజెపి తరపున శాసనసభకు ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications