వైసీపీకి మరో రఘురామ ? వదల్లేక, గెంటలేక సతమతం ! ఏం జరగబోతోంది ?
ఏపీలో ఎన్నికల ఏడాదిలోకి ఎంటరవుతున్న వైసీపీకి రెబెల్స్ బెడద పెరుగుతోంది. ఇప్పటికే రఘురామ రూపంలో ఓ కొరకరాని కొయ్య తయారు కాగా.. ఇప్పుడు కోటంరెడ్డి విషయంలోనూ అదే జరిగేలా కనిపిస్తోంది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రెబెల్స్ పోరు పెరుగుతోంది. ఓవైపు భారీ ఎత్తున సంక్షేమం, మరోవైపు ప్రజలకు చేరువయ్యేందుకు గడప గడప కార్యక్రమాల్ని ఓ రేంజ్ లో చేపడుతున్న వైసీపీకి ఇప్పుడు విపక్షాలకు తోడు స్వపక్షంలోని విపక్ష నేతలు చికాకుపెడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే నరసాపురం ఎంపీ రఘురామరాజు రూపంలో ఓ రెబెల్ కొనసాగుతుండగా.. తాజాగా మరో రెబెల్ అదే బాట పడుతున్నారు.
వైసీపీలో మరో రఘురామ రెడీ !
ఏపీలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న వైసీపీ.. అన్ని విషయాల్లోనూ విపక్షాల కంటే మెరుగైన స్ధితిలో కనిపిస్తోంది. అంతే కాదు మరోసారి అధికారం సాధించే దిశగా దూకుడుగా ముందుకెళ్తోంది. విపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా అవేవీ తమపై ప్రభావం చూపే అవకాశం లేదనే ధీమా అధికార పార్టీలో కనిపిస్తోంది. దీంతో వాటిని లెక్కచేయడం కూడా మానేసింది. కానీ ఇప్పుడు వైసీపీకి స్వపక్షంలో తయారవుతున్న రెబెల్స్ చికాకుపెట్టేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే వైసీపీలో రఘురామరాజు రూపంలో ఓ రెబెల్ నిత్యం తన విమర్శలతో చికాకుపెడుతుండగా.. ఇప్పుడు అదే బాటలో మరో రెబెల్ తయారవుతున్నారు.
రఘురామ బాటలో కోటంరెడ్డి ?
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీతో విభేదించిన రఘురామ.. అప్పటి నుంచి వైసీపీపై, సీఎం జగన్ పై విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. అంతే కాదు కేంద్రంలో తనకున్న పరిచయాలతో అక్కడ కూడా వైసీపీ సర్కార్ పై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. వాటి ప్రభావం కూడా అప్పుడప్పుడూ ప్రభుత్వంపై పడుతూనే ఉంది. అంతే కాదు తనపై అనర్హత వేటు వేసేందుకు వైసీపీ చేసిన అన్ని ప్రయత్నాల్నీ రఘురామ ఒమ్ముచేశారు. ఇప్పుడు అదే బాటలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తయారవుతున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కలకలం రేపిన కోటంరెడ్డి.. ఇప్పుడు ఆయనపై వైసీపీ చేస్తున్న విమర్శలకు దీటుగా బదులిస్తున్నారు. అంతే కాదు టీడీపీలోకి వెళ్లిపోదామనున్న తనను కెలుకుతున్నారు కాబట్టి సమాధానం ఇస్తున్నట్లు ఓపెన్ గానే చెప్తున్నారు.
వరుస ప్రెస్ మీట్లతో ఎదురుదాడి
వైసీపీతో విభేదించడం మొదలుపెట్టిన తర్వాత రఘురామరాజు ప్రెస్ మీట్లతో రచ్చ చేయడం ప్రారంభించారు. నిత్యం ప్రెస్ మీట్లు పెట్టడం, టీడీపీ అనుకూల మీడియాలో వాటిని లైవ్ వచ్చేలా చూసుకోవడం చేశారు. ఇప్పటికీ ఆయనది అదే బాట. ప్రెస్ మీట్ల సంఖ్య ఎక్కువై జనం కాస్త లైట్ తీసుకుంటున్నా.. ఫైనల్ గా కీలక విషయం ఉంటే ఆరోజు కచ్చితంగా టీడీపీ అనుకూల మీడియాలో లైవ్, కథనాలు పడాల్సిందే. ఇప్పుడు కోటంరెడ్డి కూడా అదే తరహాలో ప్రెస్ మీట్లతోనే వైసీపీ సర్కార్ కు దీటుగా బదులిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సైలెంట్ గా టీడీపీలోకి వెళ్లిపోదామని అనుకున్న కోటంరెడ్డిపై వైసీపీ నేతలు దూకుడుగా విమర్శలు చేస్తుండటంతో ఆయన కూడా రోజూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అంతే కాదు తనపై చేసిన విమర్శలకు ఎంచుకుని మరీ బదులిస్తున్నారు.
రఘురామ, కోటంరెడ్డికి తేడా అదే ?
అయితే రఘురామరాజు, కోటంరెడ్డికి మధ్య ఓ విషయంలో మాత్రం తేడా కనిపిస్తోంది. అదే భవిష్యత్ కార్యాచరణ. వైసీపీలో గెలిచి ఎంపీ, ఎమ్మెల్యేలు అయిన వీరిద్దరూ పార్టీతో విభేదిస్తూనే మరోవైపు భవిష్యత్ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో రఘురామరాజు ఏ పార్టీలోకి వెళ్తారో కచ్చితంగా చెప్పడం లేదు. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో టచ్ లో ఉంటూ వారు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కానీ కోటంరెడ్డి మాత్రం నేరుగా తాను టీడీపీలోకి వెళ్తానని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచే పోటీచేస్తానని చెబుతున్నారు. కానీ ఆయన టీడీపీలోకి ఎప్పుడు వెళ్తారో మాత్రం చెప్పడం లేదు.
బహిష్కరించలేని స్ధితిలో వైసీపీ ?
అలాగే రఘురామ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరిపైనా వైసీపీ చర్యలు తీసుకోలేని పరిస్ధితుల్లోనే ఉంది. మూడేళ్లుగా విమర్శలు చేస్తున్న రఘురామరాజుపై అనర్హత వేటు వేయించేందుకు శతవిథాలా ప్రయత్నించి విఫలమైన వైసీపీ.. ఇప్పుడు కోటంరెడ్డి విషయంలో మాత్రం రాష్ట్రంలో స్పీకర్ తమ్మినేని సాయంతో వేటు వేయించేందుకు ప్రయత్నించవచ్చు. కానీ కోటంరెడ్డిపై వేటు వేయిస్తే ఆయనకు టీడీపీలో చేరేందుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. దీంతో కోటంరెడ్డిపై అనర్హత వేటుకు వైసీపీ ప్రయత్నించకపోవచ్చంటున్నారు. అదే సమయంలో పార్టీ నుంచి బహిష్కరించినా కోటంరెడ్డి టీడీపీలో చేరిక సులువవుతుంది. దీంతో పార్టీలో నుంచీ బహిష్కరించే పరిస్ధితి లేదు. దీంతో మరో ఏడాది పాటు ఇటు కోటంరెడ్డిని, అటు రఘురామను భరించక తప్పని పరిస్ధితుల్లో వైసీపీ ఉంది.