'రైతుల కడుపు కొట్టారు': ఏనాటికైనా చంద్రబాబు జైలుకెళ్తారు?
విజయవాడ: రాజధాని అమరావతి భూదందాపై విచారణ జరిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు వెనకాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి భూదందాపై విచారణ జరిపి నిర్దోషులని తేలితే పత్రికలపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
గతంలో ఆంధ్రప్రదేశ్లో ఇసుక దోపిడీపై అనేక కథనాలు వచ్చాయని, వాటిపై కూడా చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై కథనాలు వచ్చాయని, ఆ కథనాలు ప్రసారం చేసిన మీడియాపై కూడా చర్యలు తీసుకుంటారా? అని అన్నారు.
ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిపై వరుస కథనాలను ప్రచురించిన మీడియాపై కూడా చర్యలు తీసుకుంటారా అని అడిగారు. రాజధాని అమరావతిలో టీడీపీ నేతలు చేసిన భూదందాపై 'సాక్షి' పత్రిక అన్ని ఆధారాలను బయటపెడితే, ఇంకా ఆధారాలు కావాలని అడుగుతున్నారంటూ మండిపడ్డారు.
అమరావతి భూదందాపై విచారణకు ఆదేశించిందేకు ఏ ఆధారాలు కావాలంటూ ప్రశ్నించారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణ నుంచి తప్పించుకోవచ్చని, అయితే ఏదో ఒకరోజు తప్పకుండా చంద్రబాబుకు శిక్ష పడుతుందుని హెచ్చరించారు.
ఏపీలో చంద్రబాబు పాలన అధ్వాన్నంగా ఉందన్నారు. ఏపీలో స్కీంల పాలన కాదని, స్కామ్ల పాలన అని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎప్పటికైనా విచారణ ఎదుర్కోవాల్సిందేనని, జోన్ త్రీలో ఉన్నది మీరు, మీ మంత్రులేనని ఆయనే ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విడగొట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని పేరుతో రైతుల కడుపు కొట్టారని ఆయన చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.