కొత్తపల్లి గీత గైర్హాజరు, మండిపడిన ఎమ్మెల్యే
హైదరాబాద్: నామినేషన్ పత్రాలపై ఫోర్జరీ సంతకాల అంశంపై అభియోగాలు ఎదుర్కొంటున్న అరకు పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత శనివారం విశాఖలోని కలెక్టరేట్లో జరిగిన విచారణకు గైర్హాజరయ్యారు. నామినేషన్ పత్రాలపై తమ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ పాడేరుకు చెందిన గోపాల కృష్ణ, రాంబాబు, తదితరులు ఆగస్టు 12న రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్ విచారణ జరపాలంటూ జిల్లా జాయింట్ కలెక్టర్ను ఆదేశించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జెసి ప్రవీణ్ కుమార్ శనివారం సాయంత్రం విచారణ జరపాలని నిర్ణయించారు. ఫిర్యాదుదారులు రాంబాబు, గోపాలకృష్ణ, తదితరులు జెసి ఎదుట వాంగ్మూలమిచ్చేందుకు హాజరయ్యారు. ఎంపి గీత గైర్హాజరయ్యారు. దీంతో గోపాలకృష్ణ, రాంబాబుల వాంగ్మూలాన్ని జెసి తీసుకున్నారు. మరోసారి నోటీసులు జారీ చేయనున్నట్టు జెసి ప్రకటించారు.
కాగా, నామినేషన్ పత్రాలపై ఫోర్జరీ సంతకాల విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్న గీత తనపై పసలేని ఆరోపణలు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి విమర్శించారు. ఆమె కుల నిర్ధారణపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంకా విచారణ కొనసాగుతోందన్నారు. ఇదే అంశంపై గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసిన గుమ్మడి సంధ్యారాణి స్వయంగా ఫిర్యాదు చేశారని తెలిపారు.
ఇక ఆర్డీఓగా పనిచేసిన కాలంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఎంపి గీత ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తాజాగా నామినేషన్ పత్రాలపై సంతకాల ఫోర్జరీ కేసులో విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నారన్నారు. పైగా ఎంపీ గీత తమపై క్రిమినల్ కేసులు పెట్టి, పరువునష్టం దావావేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.