కొవ్వాడలో ఉద్రిక్తత..144 సెక్షన్: ఎమ్మెల్యే ప్రసన్నతకు దళితుల భూములు కైవసం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా కొవ్వాడ మరోసారి వార్తలోకెక్కింది. నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామికి దళితుల భూములు కేటాయించడమే దీనికి కారణం.
అమరావతి: విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలం కొవ్వాడలో ఆదివారం మరోసారి ఉద్రిక్తత నెలకొంది. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడుకు చెందిన ఎస్వీఎల్ లైఫ్ సైన్స్ కంపెనీ భూములను తమకి అప్పగించాలని పోరాడుతున్న దళితులు మరోసారి భూముల్లోకి చొచ్చుకెళ్ళే ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చినందునే తాము భూముల్లో వస్తున్నామని రైతులు చెప్తున్నారు.
కానీ పోలీసులు మాత్రం వారిని అడ్డుకోవడంతో ఇరు పక్షాల మధ్య తోపులాట జరిగింది. దళితుల ఆందోళన నేపథ్యంలో ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడుకు చెందిన భూముల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొవ్వాడ గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

తుది తీర్పు ఇచ్చే వరకు సాగు చేసుకోవచ్చునని వెల్లడి
కొవ్వాడ గ్రామంలో దళితుల భూమిని ప్రైవేటు కంపెనీకి అప్పగించడాన్ని రద్దు చేస్తూ ఈ నెల 21వ తేదీన హైకోర్టు స్టే ఇచ్చింది. తుది తీర్పు ఇచ్చే వరకూ దళితులు ఆ భూముల్లో సాగు చేసుకోవచ్చునని పేర్కొన్నది. వారి సాగుకు ఎవరూ ఆటంకపర్చొద్దని హెచ్చరించింది. ప్రయివేటు కంపెనీకి దళితుల భూమిని కట్టబెట్టేందుకు ప్రభుత్వం జారీ చేసిన 58వ నంబర్ జీవోను రద్దు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు ఆదేశించారు.

2014లో నెల్లిమర్ల ఎమ్మెల్యేకు భూముల అప్పగింత
కొవ్వాడ పంచాయతీ పరిధిలోని దళితులకు 17.64 ఎకరాల భూములను ప్రభుత్వం చాలా ఏళ్ల క్రితం మంజూరు చేసింది. దళితుల పేరున పట్టాలు ఇచ్చింది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చాక నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామికి చెందిన కంపెనీ ఎస్విఎల్ లైఫ్సైన్స్ అనే బినామీ కంపెనీకి ఈ భూమి కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2016లో 58వ నంబర్ జీవో విడుదల చేసింది. దీన్ని అడ్డుపెట్టుకుని రెవెన్యూ యంత్రాంగం రూ.కోట్ల విలువైన దళితుల భూమిని ఎమ్మెల్యే అనుచరుడు మీసాల సన్యాసినాయుడు ఎండీగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేసింది. ఈ కంపెనీకి భూములు అప్పగించడం అన్యాయమని హైకోర్టును దళితులు ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.

30 ఏళ్లుగా ఎమ్మెల్యే.. మంత్రి పదవికి సుదూరమే
అధికారం వచ్చే వరకు ఒకలా.. తర్వాత మరొకలా.. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార టీడీపీ నాయకత్వం తీరు. విజయనగరం జిల్లా నుంచి అత్యధికసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి మంత్రి పదవిపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. అందునా ఆయన 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ఆయనలో అసంత్రుప్తి క్రమంగా పెరుగుతూ వచ్చింది. మంత్రి పదవి రాలేదని అలక పాన్పు ఎక్కిన పతివాడ నారాయణ స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం పూసపాటి రేగ మండలం కొవ్వాడ గ్రామంలో పతివాడ నారాయణ స్వామి సారథ్యంలోని ఫార్మా కంపెనీకి 17.67 ఎకరాల భూమికి కేటాయించింది. మార్కెట్ లో దాని ధర రూ.80 లక్షల నుంచి రూ. కోటి పలుకుతోంది కానీ ప్రభుత్వం మాత్రం కేవలం రూ.6 లక్షలకే కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

నిరాశతో అలక పాన్పెక్కిన పతివాడ
ఆయన్ను కాదని.. రాజకీయ సమీకరణాలు తదితర అంశాల పేరిట పొరుగున ఉన్న కిమిడి మ్రుణాళిని ప్రారంభంలో మంత్రి పదవి కట్టబెట్టడంతో పతివాడ నిరాశకు గురయ్యారు. దీంతో ఆయన్ను చల్లబరిచేందుకు టీటీడీ సభ్యుడిగా, అసెంబ్లీ కమిటీల్లో చోటు కల్పించినా అసంత్రుప్తి వ్యక్తం చేస్తూనే ఉండటంతో విలువైన భూపందేరానికి తెర తీశారు. 2014 అక్టోబర్ తొమ్మిదో తేదీన పతివాడ నారాయణ స్వామి ‘ఎస్వీఎల్ లైఫ్ సైన్సెస్' పేరుతో ఇద్దరు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ఫార్మాస్యూటికల్స్, నాన్ కార్బన్ తయారీ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థ డైరెక్టర్లుగా బంధువు మీసాల సన్యాసినాయుడు, సన్నిహితుడు రాగిని చంద్రశేఖర్ లను డైరెక్టర్లుగా పెట్టుకున్నారు. రూ. లక్ష మూలధనంగా చూపారు. ఆ వెంటనే పూసపాటిరేగ మండలం 16వ నంబర్ జాతీయ రహదారి పక్కనే గల కొవ్వాడ అగ్రహారం గ్రామంలోని 17.67 ఎకరాల భూమిని తన ఫార్మా సంస్థకు కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు.

భూమి కేటాయింపునకు సీఎం చంద్రబాబు ఇలా ఆదేశాలు
అధికార పార్టీ ఎమ్మెల్యేగా పతివాడ నారాయణ స్వామి ఒక కంపెనీ పేరిట భూమి కోసం పెట్టిన దరఖాస్తుపై రెవెన్యూ అధికారులు చకచకా కదిలారు. గ్రామస్తులతో అభ్యంతరం రాకుండా తీర్మానం చేయించారు. నాటి పూసపాటి రేగ తహశీల్దార్ చకచకా ఫైలు ముందుకు కదిపారు. మార్కెట్ విలువ రూ.6 లక్షలని నిర్ణయించి ఫైలును కలెక్టర్, ఆర్డీవోలకు పంపారు. ఎక్కడా అడ్డంకులే లేవు. తర్వాత సీసీఎల్ఏ, ఆ పై రెవెన్యూ కమిషనర్ వద్దకు చేరుకున్న ఫైలుపై సంతకాలు చకచకా అయిపోయాయి. సీఎం తన వద్దకు వచ్చిన ఫైలును ఆమోదించడంతో సదరు భూమి కేటాయింపునకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఎకరాల కొద్దీ భూమి కావాలంటే
కేటాయిస్తుందా? ఆ ప్రసక్తే రాదు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే కంపెనీ కావడంతో వెనుకాముందు చూసుకోకుండా సదరు భూమి కేటాయించేసింది. ఎంత మందికి ఉపాధి కల్పిస్తారు, పెట్టుబడి ఎంత? తదితర అంశాలేమీ పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. కానీ ఇదే భూముల్లో దళితులు, గిరిజనులు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారిని వెళ్లగొట్టి ఎమ్మెల్యేకు అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

కొవ్వాడ దళితుల భూముల్లో పోలీస్ బలగాల మోహరింపు
పూసపాటి రేగ మండలం కొవ్వాడలోని దళితుల భూముల్లో 2017 అక్టోబర్ 21న భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు కుమారుడు, ఆయన అనుచరులు అక్రమంగా మళ్లీ కంచెను నిర్మించారు. కొవ్వాడ దళితులకు చెరదిన 17 ఎకరాల భూములను పరిశ్రమ ఏర్పాటు పేరుతో ఎమ్మెల్యే బంధువు (బినామీ)లకు చెందిన ఎస్విఎల్ లైఫ్సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ప్రభుత్వం 2016లో దారాదత్తం చేసింది. ఈ భూముల్లో ఆ సంస్థ ఇటీవల కంచెను నిర్మించింది. ఈ సమస్య పరిష్కారానికి దళితులతోనూ తహశీల్దార్ ఆర్.ఎర్నాయుడు, డీఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చర్చలు ఏర్పాటు చేస్తామని, చర్చలు పూర్తయ్యే వరకూ ఈ భూముల్లోకి ఎవరూ రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

ఇటీవల ఆర్డిఒ సమక్షంలో చర్చలు జరిగినా సమస్య కొలిక్కి
మరోసారి చర్చలు జరుగుతాయని అందరూ భావించారు. కొవ్వాడ నుంచి దళితుల భూముల్లోకి వచ్చే దారులన్నింటినీ పోలీస్ బలగాలు దిగ్బంధించాయి. భూముల్లోకి దళితులు గానీ, దళితులకు మద్దతుగా గానీ ఎవరైనా వస్తే అరెస్టు చేస్తామంటూ పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం డీఎస్పీల అండతో ఎమ్మెల్యే కుమారుడు, అనుచరులు ఈ భూముల్లో మళ్లీ కంచె వేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎవి.రమణ మాట్లాడుతూ.. ఆ భూములను గతంలో దళితులు అమ్మేసుకున్నట్టు ఆధారాలున్నట్లు తెలిసిందన్నారు.












Click it and Unblock the Notifications