KR Suryanarayana : వీళ్లు మామూలుగా కదలరు..జగన్ సర్కార్ పై మళ్లీ ఆ ఉద్యోగ నేత ఫైర్
ఏపీ ప్రభుత్వంపై ఏకంగా గవర్నర్ కే ఫిర్యాదు చేసి వివాదాస్పదమైన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ తాజాగా ప్రభుత్వానికి మరో హెచ్చరిక చేశారు.
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టారు. ఇన్నాళ్లూ ప్రభుత్వానికి భయపడి గొంతెత్తకుండా మిన్నకున్న ఉద్యోగ నేతలు.. ఉద్యోగుల ఒత్తిడి తట్టుకోలేక రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఏపీ జేఏసీ ఈ నెల నుంచే ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తుండగా.. ఇదే కోవలోకి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కూడా చేరింది. ప్రభుత్వ ఉద్యోగసంఘ నేత కేఆర్ సూర్యనారాయణ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఉద్యోగుల జీతభత్యాలు, బకాయిలపై అప్పటి గవర్నర్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేసిన కేఆర్ సూర్యనారాయణ ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. ఆయనకు ఇచ్చిన షోకాజ్ నోటీసుపై హైకోర్టును ఆశ్రయించి మరీ ఊరట పొందారు. ఇప్పుడు మరోసారి ప్రభుత్వంపై పోరుకు కేఆర్ సూర్యనారాయణ ఇవాళ సంకేతాలు ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలపై సాధారణ నిరసనలతో స్పందించే ప్రభుత్వం కాదు ఇది అంటూ జగన్ సర్కార్ పై ఆయన ఇవాళ విశాఖలో విమర్శలు గుప్పించారు.

ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మామూలు నిరసనలకు తలొగ్గేలా లేదని,అందుకే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నట్లు కేఆర్ సూర్యనారాయణ ఇవాళ ప్రకటించారు. ఇప్పటికే ఉద్యోగులకు ప్రభుత్వ బకాయిలు 12 వేల కోట్లు దాటిపోయాయని, రాష్ట్రంలో ప్రతీ ఉద్యోగికీ ప్రభుత్వం రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షల బకాయి ఉందని ఆయన తెలిపారు. ఉద్యోగులకు జీపీఎఫ్ డబ్బులు చెల్లించేందుకు ఖాతాల్లో డబ్బు లేదని కేఆర్ సూర్యనారాయణ తెలిపారు. దీనిపై ఎవరు నిరసనలు చేసినా మద్దతిస్తామన్నారు.
రాష్ట్రంలో ఉద్యోగ సమస్యలపై ఎవరు ఉద్యమాలు చేసినా మద్దతిస్తామని, కానీ తీవ్రత లేని ఉద్యమాలతో ఉపయోగం లేనందువల్ల ఏప్రిల్ నుంచి తామే ఉద్యమం చేయాలని నిర్ణయించినట్లు కేఆర్ సూర్యనారాయణ ప్రకటించారు. గవర్నర్ తో భేటీ తర్వాత ప్రభుత్వానికి కంటగింపుగా మారిన కేఆర్ సూర్యనారాయణ తాజా వ్యాఖ్యలపై సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications