మనుగడ కష్టమే?: బాబుకు పట్టదా.. కృష్ణా నదిపై 'వాటర్ మ్యాన్' ఆందోళన
బుధవారం కృష్ణా నది బచావో పేరిట చేపట్టిన పరిరక్షణ యాత్రలో రాజేంద్రసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ నదులకు మనుగడ లేకుండా చేయాలని చూస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబుపై వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మెగసెస్ అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ ఫైర్ అయ్యారు. అక్రమ కట్టడాలతో కృష్ణా నదిని నాశనం చేస్తున్నారని, సీఎం సైతం నది పరివాహక ప్రాంతంలో నివసించడం ఆక్షేపనీయమని అభ్యంతరం వ్యక్తం చేశారు.
బుధవారం కృష్ణా నది బచావో పేరిట చేపట్టిన పరిరక్షణ యాత్రలో రాజేంద్రసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. యాత్రలో ఆయనతో పాటు పలువురు పర్యావరణవేత్తలు పాల్గొన్నారు. 'మేం చెబితే చంద్రబాబు వినడం లేదు.. జగ్గీ వాసుదేవ్ చెబితే వింటారేమో!. ఆయన సింగపూర్ మాటలనే ఇష్టపడుతున్నట్లున్నారు. వాళ్లు గాల్లో ఎగురుతారు, మేం భూమిపై నడుస్తాం' అంటూ చంద్రబాబును రాజేంద్రసింగ్ ఎద్దేవా చేశారు.
ఇదేదో స్థానిక ఉద్యమం కాదని, కృష్ణానదీ బచావో పాదయాత్ర దేశవ్యాప్త ఉద్యమం అవుతుందని, దేశంలోని అన్ని రాజకీయ పార్టీ నేతలను కలుపుకుని పరిరక్షణ యాత్ర చేస్తామని ఆయన అన్నారు. నదుల పరిరక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రొఫెసర్ విక్రమ్ సోనీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారు. నదులు లేకపోతే మానవ మడుగడే ప్రశ్నార్థకం అన్నారు. కాగా, ఈరోజు ప్రారంభమైన పరిరక్షణ యాత్ర ఈ నెల 6వరకు కొనసాగనుంది. మద్దూరు, పాపవినాశనం, హంసలదీవి, పెనుముడి, కొల్లూరు మీదుగా బీజాపూర్ వరకు ఈ పాదయాత్ర సాగనుంది.