తెలంగాణ ఫిర్యాదు: పోతిరెడ్డిపాడుపై ఏం చెబుతారంటూ ఏపీ సర్కారుకు కృష్ణా ట్రిబ్యునల్ లేఖ
హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు జారీ చేసిన జీవోకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశించింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక, వివరాలను అందించాలని స్పష్టం చేసింది.
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై తెలంగాణ చేసిన ఫిర్యాదుపై స్పందించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.. ఏపీ ప్రభుత్వ వివరణను కోరింది. ఈ మేరకు బోర్డు సభ్యుడు హరికేష్ మీనా తెలంగాణ ప్రభుత్వ లేఖను జతపరుస్తూ ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
శ్రీశైలం నుంచి అదనంగా మూడు టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రతిపాదించిన కొత్త ఎత్తిపోతలపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని ఆ లేఖలో పేర్కొంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్ సామర్థ్యం పెంపుపై తెలంగాణ గతంలో బోర్డుకు ఫిర్యాదు చేసిందని, దాని ఆధారంగానే ఫిబ్రవరి 5న ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరామని వెల్లడించింది.
మే 13వ తేదీన మరో లేఖ రాసినప్పటికీ ఏపీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని ఆ లేఖలో వెల్లడించిన బోర్డు.. దీనిపై వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. పోతిరెడ్డిపాడు విషయంపై ఇప్పటికే రెండు రాష్ట్రాల సర్కారుల మధ్య కొంత దూరం పెరిగినట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.