చంద్రబాబుకు షాక్: దానికే అంటూ బ్రిజేష్, అమరావతికి తెలంగాణ కొలికి
న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా కృష్ణా నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడుతున్న అంతర్నాటకానికి.. ఇష్టారాజ్యానికి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చెంపపెట్టువంటివని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కృష్ణా బేసిన్లో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టి కర్నూల్ జిల్లా మీదుగా నీటిని తరలించి తుంగభద్ర, పెన్నా బేసిన్ల పరిధిలో ప్రాంతాలకు సాగునీరు తరలించిన ఘనత ఉమ్మడి ఏపీ సర్కార్ది. ఏపీ పునర్యవస్థీకరణ చట్టంలో కూడా నాటి ఉమ్మడి ప్రభుత్వ వాదనే చేరింది తప్ప.. తెలంగాణ వాదనకు ఆస్కారం లేకుండా పోయింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాజెక్టులకు నీటి వాటాలు కేటాయించాలన్న ఆంధ్రప్రదేశ్ వాదనపై జస్టిస్ బ్రిజేశ్కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన ఈ ప్రాజెక్టులకు హక్కుగా నీటి వాటా ఎలా లభిస్తుందని ఆ రాష్ర్టాన్ని ప్రశ్నించింది. రెండేళ్ల క్రితం రెండు రాష్ట్రాల కుదిరిన తాత్కాలిక అంగీకారాన్ని చట్టబద్ధం చేయాలన్న వాదననూ ట్రిబ్యునల్ తిరస్కరించింది.
పట్టిసీమపై తెలంగాణ వాదనలకు సమర్థన
పట్టిసీమపై సైతం తెలంగాణ వాదనలను సమర్థించిందదని 'నమస్తే తెలంగాణ'లో ఒక వార్తాకథనం ప్రచురించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 పరిధి తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు మాత్రమే పరిమితమని గతంలో స్పష్టం చేసిన ట్రిబ్యునల్.. ఉమ్మడి రాష్ర్టానికి లభించిన నీటిని రెండు రాష్ర్టాలకు ప్రాజెక్టులవారీగా కేటాయించడంపై ఢిల్లీలో గురువారం విచారణ జరిపింది. తెలంగాణ ప్రతిపాదించిన 16 అంశాలను స్వల్ప సవరణలతో ఆమోదించింది. ఏపీ ప్రతిపాదించిన 11 అంశాల్లో రెండింటిని పూర్తిగా తిరస్కరిస్తూ ఒక అంశంపై నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేసింది.
బేసిన్ పరిధిలోనే ప్రాజెక్టులకే తొలి ప్రాధాన్యం అన్న బ్రిజేశ్ ట్రిబ్యునల్
బేసిన్ పరిధిలో ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల్లో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్న తెలంగాణ వాదనను సమర్థించింది. ఏపీ అమరావతిలో నూతన రాజధానిని నిర్మించుకుంటూ సీఆర్డీఏ పరిధిలోని సాగుభూములను వినియోగించుకుంటున్నందువల్ల ఆ మేరకు ఆ రాష్ట్రానికి నీటి కేటాయింపులను తగ్గించాలన్న తెలంగాణ వాదనతోనూ ట్రిబ్యునల్ ఏకీభవించింది. 11వ షెడ్యూలులోని ప్రాజెక్టులకు నీటి వాటాలు నిర్ణయించాలని ఏపీ కోరింది.
అయితే మిగులు జలాలపై ఆధారపడిన ఈ ప్రాజెక్టులకు నీటిలో వాటా హక్కు ఎలా సంక్రమిస్తుందని ట్రిబ్యునల్ నిలదీసింది. తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు ప్రాజెక్టులవారీ కేటాయింపులు, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు అవలంబించాల్సిన ఆపరేషన్ ప్రోటోకాల్ ఖరారుకు రెండు రాష్ర్టాలు వాదనలను ట్రిబ్యునల్కు వినిపించాయి.
అమరావతితో కృష్ణా డెల్టా వాటా తగ్గించాలని తెలంగాణ డిమాండ్
తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదిస్తూ, అమరావతి నిర్మాణం కోసం సాగుభూముల్ని స్వాధీనం చేసుకున్నందువల్ల ఆ మేరకు ఆ రాష్ట్రానికి నీటి కేటాయింపుల్ని తగ్గించి, ఆ నీటిని బేసిన్ పరిధిలో ఉన్న ప్రాజెక్టులకు కేటాయించాలని కోరారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల నీరు కృష్ణా బేసిన్లోకి చేరిందని, దానిని ఆ రాష్ర్టానికి కృష్ణా జలాల్లో లభించిన వాటాగానే పరిగణించాలని అన్నారు.
80 టీఎంసీలలో తెలంగాణకు న్యాయమైన వాటాను ఇవ్వాలని కోరారు. దీనిపై ఏపీ వ్యక్తం చేసిన అభ్యంతరాన్ని ట్రిబ్యునల్ తోసిపుచ్చుతూ తెలంగాణ వాదన సహేతుకమేనని పేర్కొంది. కృష్ణా నదిలో నీటి లభ్యతను తేల్చిన తర్వాతనే ప్రాజెక్టులకు కేటాయింపుల విషయం తేల్చాలని వైద్యనాథన్ వాదించారు. రెండేండ్ల క్రితం రెండు రాష్ర్టాల మధ్య కుదిరిన తాత్కాలిక అంగీకారాన్ని చట్టబద్ధం చేయాలన్న ఏపీ వాదనను ట్రిబ్యునల్ తిరస్కరించింది. అన్ని ప్రతిపాదనలపై సవరణలను ట్రిబ్యునల్ శుక్రవారం ఖరారు చేయనున్నది.