హరికృష్ణకు చేయి: ఎన్టీఆర్ జిల్లాలో టిడిపి దిగదుడుపే
విజయవాడ: ఎన్టీ రామారావు సొంత జిల్లా కృష్ణాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగులేదు. ఈ జిల్లాలోని ఏదో ఒక శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించిన ఎన్టీ రామారావు తనయుడు నందమూరి హరికృష్ణకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేయిచ్చారు. హరికృష్ణ పోటీ చేసి ఉంటే పరిస్థితి కాస్తా మెరుగ్గా ఉండేదని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నట్లు అంచనాలు సాగుతున్నాయి.
కృష్ణా జిల్లాలో 16 శాసనసభ స్థానాలు ఉండగా తిరువూరు, నందిగామ, పామర్రు నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. అభ్యర్థుల ఎంపికలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ పార్టీకి ఎక్కడా తిరుగుబాట్లు, సమస్యలు ఎదురుకాలేదు. ఇంచార్జీలుగా నియమితులైన వారికే ఆయా నియోజకవర్గాల్లో సీట్లు కేటాయించటం పార్టీకి కలిసొచ్చింది.
తెలుగుదేశం - బిజెపి పొత్తు నామినేషన్ల ఘట్టంలో మలుపులు తిరిగి నేతలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఈ కూటమి ఐదు నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి, అది కూడా చివరి క్షణంలో దరిచేర్చుకుని మరీ టిక్కెట్లు ఇచ్చేసింది. దాంతో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు సహాయ నిరాకరణ ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మండలి బుద్ధప్రసాద్కు అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ సీటు లభించింది. బుద్ధప్రసాద్ అక్కడ కాంగ్రెస్ తరపున నాలుగుసార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచారు. ఇదే సమయంలో అంబటి బ్రాహ్మణయ్య, సింహాద్రి సత్యనారాయణరావు వర్గాలతో ఆయనకు వైరం కూడా ఉంది. బుద్ధప్రసాద్కు సీటు కోసం చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే అంబటి హరిప్రసాద్ను పక్కనపెట్టారు.
గన్నవరం కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు ఆఖరి క్షణంలో నూజివీడు టిడిపి సీటు లభించింది. గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లటంతో గత ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున పోటీచేసిన రావి వెంకటేశ్వరరావును దరిచేర్చుకుని సీటిచ్చారు.
బిజెపి నేతలు పొత్తుల్లో తమకు లభించిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ను అర్ధరాత్రి వేళ పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు. దాంతో టిడిపిలోనూ, బిజెపిలోనూ తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. కైకలూరులో కూడా గత ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున పోటీచేసిన కామినేని శ్రీనివాసరావును హడావుడిగా పార్టీలో చేర్చుకుని సీటిచ్చారు. టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ రెబల్గా నామినేషన్ దాఖలు చేశారు. నూజివీడు సీటు కోసం ఆఖరి క్షణం వరకు ఎదురుచూసిన మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు నాయకత్వంపై అలక వహించారు.
గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావును కాదని వల్లభనేని వంశీమోహన్కు సీటివ్వడంపై దాసరి వర్గం గుర్రుగా ఉంది. మరోవైపు ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ ఆఖరి క్షణం వరకు జిల్లా నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. ఇందుకోసం పెనమలూరు, విజయవాడ తూర్పు సీట్ల కేటాయింపులో అంతులేని జాప్యం జరిగింది. దీనివల్ల కూడా పార్టీ ఎంతోకొంత మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక్క 1999లో మాత్రమే జిల్లాలో 13సీట్లు రాగా , 2004 ఎన్నికల్లో పార్టీకి కేవలం రెండే సీట్లు లభించాయి. అప్పుడు కొడాలి నాని, దేవినేని ఉమామహేశ్వరరావు మాత్రమే గెలిచారు. 2009 ఎన్నికల్లో 8 సీట్లు రాగా కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసులోకి, చిన్నం రామకోటయ్య కాంగ్రెస్లోకి వెళ్లిపోగా, ఇద్దరు సిట్టింగ్లకు సీట్లు ఇవ్వలేదు. దీని ప్రతికూల ప్రభావం టిడిపిపై పడే అవకాశం ఉందని అంటున్నారు.