టిడిపి అంటే..: కెటిఆర్ ధ్వజం, కిరణ్పై ఫిర్యాదుకు కాంగ్
కరీంనగర్/విజయవాడ/: తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెసు పార్టీలో విలీనం చేయాలన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డిల పైన ఆ పార్టీ సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం కరీంనగర్ జిల్లాలో మండిపడ్డారు.
తెరాస విలీనంపై మాట్లాడే అర్హత టిటిడిపి నేతలకు లేదన్నారు. ఎర్రబెల్లి, రేవంత్లు తెలంగాణ ద్రోహులని ధ్వజమెత్తారు. టిడిపి దళారుల పార్టీ అన్నారు. తెలంగాణ ద్రోహుల పార్టీగా టిడిపి మారిందన్నారు. తెరాసను కాంగ్రెసు పార్టీలో విలీనం చేయాలని టిటిడిపి నేతలు కోరడం హాస్యాస్పదమన్నారు.
టి బిల్లుపై చర్చిస్తాం: పార్థసారథి
తాము అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చిస్తామని మంత్రి పార్థసారథి విజయవాడలో అన్నారు. బిల్లులోని అభ్యంతరాలు, వ్యతిరేకతపై తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపిస్తామన్నారు. జనవరిలో టెట్ నిర్వహిస్తామని తెలిపారు.
జానా నివాసంలో టి నేతల భేటీ
పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత నేతలు భేటీ అయ్యారు. వారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన ఫిర్యాదు చేసే అవకాశముంది. తెలంగాణ ముసాయిదా డ్రాఫ్ట్ పైన అసెంబ్లీ అభిప్రాయం కోసం ఎలాంటి గడువును పెంచవద్దని తాము రాష్ట్రపతిని కోరుతామని షబ్బీర్ అలీ, మంత్రి సారయ్యలు అన్నారు.