టీవీ9, ఎబిఎన్పై కెటిఆర్, ఇదీ బాబు స్వరూపం: హరీష్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లు టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను నిలిపివేసిన విషయంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం స్పందించారు. టీవీ ఛానళ్లను నిలిపివేయడంతో ప్రభుత్వ పాత్ర లేదన్నారు. కేబుల్ పరిశ్రమ స్వయం ప్రతిపత్తి సంస్థ అని, దీన్ని ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదన్నారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
సాఫ్టువేర్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. అలాగే హార్డ్ వేర్ హబ్గాను మారుస్తామన్నారు. హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. పారిశ్రామికవేత్తలను సాదరంగా ఆహ్వానిస్తామన్నారు.
ఇన్క్యుబేషన్ ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. హైదరాబాదును సాంకేతిక రంగంలో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. హైటెక్స్లో ఇండియ్ గ్యాడ్జెట్ ఎక్స్పో 2014ను కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
బాబుపై హరీష్ రావు నిప్పులు
పిపిఏల రద్దుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు గురువారం ఎపి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబు అసలు స్వరూపం బయటపడిందన్నారు. పిపిఏల రద్దుపై తెలంగాణ టిడిపి నేతల వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. చంద్రబాబు కావాలో లేక తెలంగాణ కావాలో వారు తేల్చుకోవాలన్నారు. తెలంగాణలో విద్యుత్ కొరత రానివ్వమని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై మందకృష్ణ
తెలంగాణ జిల్లాలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలు నిలిపివేయడానికి ప్రభుత్వమే కారణమని, అందుకు సూత్రధారి కెసిఆర్ అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ వేరుగా ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్ ఘటన చాలా విచారకరమన్నారు. అది స్టడీ టూర్ కాదు విహార యాత్ర అన్నారు. 24 మంది విద్యార్థుల మృతికి విజ్ఞాన జ్యోతి కాలేజీదే బాధ్యత అని ఆయన మండిపడ్డారు. కెసిఆర్ కుమార్తె కవిత ఈ కాలేజీలోనే చదువుకున్నారని, అందుకే చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాలేజీ నిర్లక్ష్యంపై శుక్రవారం హెచార్సీలో ఫిర్యాదు చేస్తానని చెప్పారు.