అబ్బో నాలుగుగంటలే: జగన్ వెటకారం, కెటిఆర్ ఆగ్రహం

'అబ్బా.. ఆయన నాలుగు గంటలు దీక్ష చేశారా? చాలా గొప్ప. ఎప్పుడైనా కడుపు మాడ్చుకొని సమైక్యాంధ్ర కోసం ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేశాడేమో అడగండి. నాలుగు గంటలు చేశాడట. మూడు వారాల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుండటంతో ఎన్నికలకు పోక తప్పదని రెండువందల మందితో నాలుగు గంటలు దీక్ష చేశాడట. మళ్లీ దానికో పబ్లిసిటీ.. బిల్డప్. నాకు బిపి గాని, షుగర్ గానీ లేవు. కెసిఆర్, చంద్రబాబులకు షుగర్ ఉంది. ఏం తినకుండా, తాగకుండా 36 గంటలు వాళ్లను కోర్చోమనండి చూస్తా.. షుగర్ పేషెంట్లు ఎలా బతుకుతారో చూస్తా. కిరణ్ ఎలాగు దీక్ష చేయలేదు అని' అని ఎద్దేవా చేశారు.
తెలంగాణ, కిరణ్ దీక్షపై కెటిఆర్
ప్రస్తుత సమావేశాల్లోనే విభజన బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాలన్నదే తమ డిమాండ్ అని కెటిఆర్ అన్నారు. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని తాము వ్యతిరేకించడంలేదని, లోక్సభలోనూ ఈ సమావేశాల్లోనే బిల్లు ఆమోదం పొందాలని అన్నారు. అసెంబ్లీలో మూజువాణి ఓటుతో బిల్లును ఏకగ్రీవంగా తిరస్కరించామని, ఎవరూ డివిజన్ కోరలేదని సీఎం కిరణ్కుమార్రెడ్డి చెప్పడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.
రేపు పార్లమెంటులోనూ మూజువాణి ఓటుతో విభజన బిల్లును ఆమోదిస్తారని, అప్పుడు ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు సీఎం అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో మూజువాణి ఓటుతో తిరిస్కరించినట్లే ముఖ్యమంత్రి మూతి మీద తన్నినట్లు పార్లమెంటులో మూజువాణి ఓటుతోనే బిల్లు గట్టెక్కుతుందని చెప్పారు. అప్పుడు సీఎం అటు (ఢిల్లీ) నుంచి అటే హిమాలయాలకు వెళ్లి సన్యాసుల్లో కలవడం ఖాయమని ఎత్తిపొడిచారు.
ఢిల్లీలో సిఎం నిర్వహించిన దీక్ష అట్టర్ ఫ్లాప్ అయిందని, వేదికపై 60-70 మంది కూర్చుంటే వేదిక ముందు 60-70 మంది కూడా లేరని ఎద్దేవా చేశారు. ఆయన తన దీక్షతో తెలుగు అత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టారని, పూర్తిగా పరువు తీశారని విమర్శించారు. రాష్ట్రపతిని కలిసి అంకెల రంకెలు వేస్తూ అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 80% మంది సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారంటూ రాష్ట్రపతికి సిఎం చెప్పారని, రాష్ట్రంలోని 294 మంది ఎమ్మెల్యేలను సమైక్యమని చెప్పించగలరా అని సవాల్ చేశారు.
అందుకే అజ్ఞానం, అహంకారం, మూర్ఖత్వం కలబోతే కిరణ్ అని ఆరోపించారు. ఢిల్లీలో సీఎం వాహనాన్ని అడ్డుకున్న తెలంగాణ మంత్రులు గీతా రెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, డికె అరుణ, శ్రీధర్ బాబులను తోటి సహచర మంత్రులుగా పలకరించలేని సంస్కారహీనుడని విమర్శించారు. అసలు సిఎం పోస్టులో ఉండే యోగ్యత, అర్హత ఆయనకు లేవని ఎత్తిపొడిచారు. సిఎం నెత్తి నోరు మొత్తుకున్నా, అరిచి గీ పెట్టినా తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడం తథ్యమని, అసెంబ్లీ తీర్మానం నాలుక గీచుకోవడానికైనా పనికిరాదని ఆయన అన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి ఓ నియంత అని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. మహిళా మంత్రుల పైన పోలీసులు దౌర్జన్యం చేస్తుంటే ముఖ్యమంత్రి బస్సు నుండి కూడా దిగకుండా వినోదం చూసారని, ఆయన దీక్ష సరికాదని వి హనుమంత రావు అన్నారు.












Click it and Unblock the Notifications