బ్రాండ్ ఇమేజ్: జైపాల్ రెడ్డికి కెటిఆర్ కౌంటర్
హైదరాబాద్: పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్లో 100 రోజుల పాలనపై తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు శనివారం నివేదిక విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 1 నుంచి కొత్త పింఛను విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో రోడ్లు, మంచినీరు, డ్రైనేజీల ఏర్పాటు తమ ప్రాధాన్యమని వెల్లడించారు.
2015 ఆగస్టుకల్లా ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు. 2019 వరకు ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని నిర్మిస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి తాగునీరందించే లక్ష్యంతో రూ. 20వేల కోట్లతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కెటిఆర్ తెలిపారు. చిన్న నీటి పారుదల వ్యవస్థ పునరుద్దరణకు ఏటా రూ. వెయ్యి కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు.
1,192 గిరిజన తండాలు, గూడేలను పంచాయతీలుగా గుర్తించినట్లు వివరించారు. పింఛన్లు లబ్ధిదారులకు చేర్చేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. 96 లక్షల కుటుంబాల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేసినట్లు పేర్కొన్నారు. కొత్త పంచాయతీరాజ్ విధానం రూపొందించి త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఉపాధి హామీలో అక్రమాలు, సమస్యల పరిష్కారానికి హెల్ప్లైన్ 1800 200 1001 ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
టిఆర్ఎస్పై మాజీ కేంద్రమంత్రి జైపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కెటిఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వందరోజుల పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఎలా దెబ్బతీశామో ఆధారాలతో సహా చెప్పాలని మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. అడ్డదిడ్డంగా మాట్లాడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.
గత ప్రభుత్వంలో పిసిసి చీఫ్ పేరు ఛార్జీ షీట్లో ఉందని, ఎంపీలు, మంత్రులు, ఐఏఎస్లు జైలుకెళ్లారని కెటిఆర్ గుర్తు చేశారు. అప్పుడు తగ్గని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు తగ్గిందా అని కెటిఆర్.. జైపాల్ రెడ్డిని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తోందని చెప్పారు.