ఢీకొట్టేది కెసిఆరే: కెటిఆర్, ఎపికి పని చేయం: ఉద్యోగులు
కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. తాను, హరీశ్ రావు, తన సోదరి కల్వకుంట్ల కవిత దొడ్డిదారిలో మంత్రులం కాలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడామని, అందుకే తమను ప్రజలు గెలిపించారన్నారు. విమర్శకులకు పని తీరుతో సమాధానం చెప్తామన్నారు. మంత్రివర్గ విస్తరణలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.
సచివాలయంలో ఉద్యోగుల ఆందోళన
సచివాలయం సీ బ్లాక్ ఎదుట తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చేశారు. ఉద్యోగుల విభజనలో భాగంగా తెలంగాణ ఉద్యోగులైన తమను ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయడం సరికాదని వారు అంటున్నారు. తమను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
తాము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని, ఇప్పుడు తమను ఏపికి కేటాయిస్తే ఇబ్బందులకు గురి చేస్తారన్నారు. ఉద్యోగుల ఆందోళన పైన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, ఎవరి ప్రాంతంలో వారు పని చేసేలా చర్యలు తీసుకుంటామని, నెల రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.
బ్యాంకర్లతో కెసిఆర్ భేటీ
సచివాలయంలో కెసిఆర్ బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీకి సంబంధించి ప్రధానంగా కెసిఆర్ బ్యాంకర్లతో చర్చించారు. రైతులకు లక్ష రూపాయల లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తానని కెసిఆర్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తెరాస జెండాను తగులబెట్టిన దుండగులు
హైదరాబాదులోని జీడిమెట్లలోని అపురూపకాలనీలో టీఆర్ఎస్ జెండాను దుండగులు తగులబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇది సమైక్యవాదుల పనే అని, జెండాను తగులబెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కార్యకర్తలకు సర్ధిచెప్పడంతో వారు శాంతించారు.