వైయస్ వల్లే కాలేదు: జగన్పై కెటిఆర్, బాబుకు ప్రశ్న
హైదరాబాద్: తెలంగాణను దివంగత వైయస్ రాజశేఖర రెడ్డే ఆపలేకపోయారని ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమవుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆంధ్రా వాళ్ల నోళ్లకు కేబినెట్ నోట్ ఆగుతుందేమోననే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు.
హైదరాబాదు పైన కారుకూతలు కూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హైదరాబాదును తన తొమ్మిదేళ్ల పాలనలో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పదేళ్లలో ఆంధ్రా ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేరా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాదులో పుట్టినంత మాత్రాన తెలంగాణకు చెందిన వాడిగా గుర్తించలేమన్నారు.

తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీలు తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక శాఖలను ఏర్పాటు చేయాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి ఆ రెండు పార్టీల పైన ఒత్తిడి తీసుకు రావాలన్నారు.
కాంగ్రెస్ ఇవ్వకుంటే బిజెపి ఇస్తుంది: నాగం
తెలంగాణపై కాంగ్రెసు పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని, ఆ పార్టీ రాష్ట్రాన్ని ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల అనంతరం భారతీయ జనతా పార్టీ ఇస్తుందని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో అన్నారు. కిరణ్ సీమాంధ్రకు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నిర్ణయంలో జాప్యం వల్ల తెలంగాణలో ఆత్మబలిదానాలు జరుగుతున్నాయన్నారు. ఈ నెల 28న జరగనున్న ప్రజాగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
జగన్ ఒత్తిడి: సోమిరెడ్డి
విభజన బిల్లును ఆమోదించే కుట్రలో భాగంగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేల పైన ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తీసుకు వస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేరుగా అన్నారు. కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుర్చీపైన ఆయన కన్నేశారని మండిపడ్డారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయన దత్తపుత్రుడిగా మారిపోయారన్నారు.












Click it and Unblock the Notifications