కుప్పం మొట్టమొదటి మున్సిపల్ ఛైర్మన్గా డాక్టర్ ఎంపిక: చంద్రబాబుతో సై అంటే సై
చిత్తూరు: ఊహించినట్టే.. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సొంత అసెంబ్లీ నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీకి నిర్వహించిన ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. తిరుగులేని ఆధిక్యాన్ని కనపరిచింది. మున్సిపాలిటీపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరింది. ఇదివరకు గ్రామ పంచాయతీలు, జెడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రదర్శించిన దూకుడును మున్సిపల్ ఎన్నికలోనూ కొనసాగించింది.
ఏ ఎన్నికలొచ్చినా రిజల్ట్ ఇట్లనే ఉంటది: విశ్వసనీయత..విలువలకు పట్టం: జగన్ వెనుకే జనం: రోజా
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను గెలుచుకోవడం ఒక ఎత్తయితే.. కుప్పంలో పాగా వేయడం మరో ఎత్తుగా పరిగణిస్తున్నాయి. ఇదివరకు మేజర్ పంచాయతీగా ఉంటూ వచ్చింది కుప్పం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాతే.. అది మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. తాను అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే కుప్పాన్ని మున్సిపాలిటీగా బదలాయించారు వైఎస్ జగన్.
మున్సిపాలిటీగా ఆవిర్భవించిన తరువాత ఎదుర్కొన్న మొట్టమొదటి ఎన్నికలో అధికార పార్టీ విజయఢంకా మోగించింది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించింది. ఇలాంటి ప్రతిష్ఠాత్మక మున్సిపాలిటీకి ఛైర్మన్గా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఈ బాధ్యతను కూడా వైఎస్ జగన్.. చిత్తూరు జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి అప్పగించారు.
కాగా- కుప్పం మున్సిపల్ ఛైర్మన్గా డాక్టర్ సుధీర్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలో ఆయన 16వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఘన విజయాన్ని అందుకున్నారు. డాక్టర్గా ఆయనకు మంచి పేరు ఉంది. స్థానికంగా అందుబాటు ఉంటాడని పార్టీ నాయకులు స్పష్టం చేస్తోన్నారు. అందుకే- ఈ ప్రతిష్ఠాత్మక మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం డాక్టర్ సుధీర్ను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. వివాదరహితుడని, రాజకీయాలకు కొత్తే అయినప్పటికీ.. సమయస్ఫూర్తితో వ్యవహరించగలడని అంటున్నారు.
చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం కావడం వల్ల రాజకీయంగానూ ఎదుర్కొనడానికి డాక్టర్ సుధీర్ అభ్యర్థిత్వం ఉపకరిస్తుందని వైసీపీ నాయకులు తేల్చి చెబుతున్నారు. భవిష్యత్తులో కుప్పం నియోజకవర్గాన్ని సొంతం చేసుకోవడానికి అవసరమైన వ్యూహాలు, ప్రణాళికలు, అన్నింటికీ మించి- మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను సమర్థవంతంగా చేపట్టాల్సిన అవసరం ఉందని, అప్పుడే అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా చంద్రబాబును ఢీ కొట్ట వచ్చని అంచనా వేస్తోన్నారు.