నారా లోకేష్ నాయకత్వంపై టీడీపీలో ఆశల్లేనట్టే: మొన్న తిరుపతి..నేడు కుప్పం: అడుగు పెడితే..అంతేనా
చిత్తూరు: ఊహించిందే చోటు చేసుకుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అంచనాలు తప్పలేదు. వారు వేసిన స్కెచ్ వమ్ము కాలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గంలో పాగా వేయడానికి వైసీపీ నేతలు వేసిన వ్యూహాలు పక్కాగా ఫలించాయి. ఎంత పకడ్బందీగా ఈ వ్యూహాలను రచించుకోగలిగారో.. అంతే పకడ్బందీగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగారు. ఫలితంగా- ఇప్పటిే బీటలు వారిన తెలుగుదేశం పార్టీ కంచుకోట కుప్పకూలిపోయింది.
టీడీపీకి కంచుకోటగా..
ఆవిర్భావం నుంచీ తెలుగుదేశం పార్టీకి పట్టం కడుతూ వస్తోన్నారు కుప్పం ఓటర్లు. తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా ఓటమి చవి చూడని అసెంబ్లీ స్థానాల్లో ఇదీ ఒకటి. టీడీపీ అభ్యర్థిగా 1989లో తొలిసారిగా కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేశారు. ఇప్పటిదాకా వరుసగా ఏడుసార్లు విజయం సాధించారు. ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చివేశారు. మరో పార్టీ ఇక్కడ పాగా వేయాలంటే ఒకటి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితిని కల్పించారు.
మసకబారుతోన్న ఛరిష్మా..
అలాంటి పరిస్థితులు ఇప్పుడు అక్కడ లేవు. పార్టీకి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు ఛరిష్మా మసకబారింది. టీడీపీ కోటకు బీటలు ఏర్పడ్డాయి. దాదాపు కుప్పకూలిపోయే స్థితికి చేరుకుంది పార్టీ. టీడీపీ అధినేత పోటీ చేసినా సరే.. గెలవడానికి చెమటోడ్చక తప్పదనే రాజకీయ వాతావరణ కుప్పంలో నెలకొంది. ఆయన ఓడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ స్థానంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిదర్శనం..
కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నుంచి టీడీపీ బలహీనడిందనేది మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలు స్పష్టం చేశాయి. పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ స్థాయిలో ఏ ఎన్నికలోనూ టీడీపీ విజయం సాధించలేదు సరికదా.. గట్టీ పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఓట్ల శాతాన్ని భారీగా కోల్పోయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో 30 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయిన వైఎస్సార్సీపీ.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే- ఈ స్థానాన్ని అవలీలగా కైవసం చేసుకోగలుగుతుందనే విషయాన్ని స్థానిక సంస్థల ఎన్నికలు రుజువు చేశాయి.
పార్టీలకు అతీతంగా పాలన..
కుప్పంలో పార్టీ బలహీనపడటానికి మూడు అంశాలు కీలకంగా మారినట్లు తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఒకటి- జగన్ సర్కార్ పరిపాలన తీరు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్ల ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా ఉన్న కుటుంబాలకు ఇంటివద్దే సంక్షేమ పథకాలను అందివ్వడం ప్లస్గా మారింది. అదే సమయంలో టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న యువతీ యువకులు వలంటీర్లుగా నియమితులు కావడం, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలను సాధించడం వైసీపీకి అనుకూల పరిస్థితులను కల్పించిందని చెబుతున్నారు.
నారా లోకేష్ ప్రచారం చేసినా..
ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు. ఒకరోజంతా ఆయన కుప్పంలో పర్యటించారు. తన తండ్రి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. వర్షంలోనూ విస్తృతంగా ప్రచారం సాగించారు. అవేవీ సత్పలితాలను ఇవ్వలేదు. టీడీపీని ఓడించాలని భావించిన కుప్పం మున్సిపల్ ఓటర్ల మైండ్సెట్ను మార్చలేకపోయింది. ఈ విషయం తాజా ఫలితాలతో స్పష్టమైంది.
నారా లోకేష్కు రెండో ఓటమి..
నారా లోకేష్కు ఇది రెండో ఓటమిగా చెప్పుకోవచ్చు. ఇదివరకు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో ఆయన తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రచారకర్తగా పని చేశారు. విస్తృతంగా పర్యటించారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పలుమార్లు కలియ తిరిగారు. పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించడానికి శ్రమించారు. అయినప్పటికీ.. ఓటమి తప్పలేదు. రెండున్నర లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
కుప్పంలోనూ ఎదురుదెబ్బలే..
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ప్రతికూల వాతావరణం వీస్తుందనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఆలస్యంగా పసిగట్టిందో లేక.. గెలిచి తీరుతామనే అతి విశ్వాసమో తెలియట్లేదు గానీ.. కొంత నిర్లక్ష్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కుప్పం మున్సిపాలిటీలో పార్టీని గెలిపించే బాధ్యతను తీసుకున్న సీనియర్ నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అక్కడే మకాం వేశారు. ఈ విషయం తెలిసి కూడా టీడీపీ పెద్దగా తన వ్యూహాలను మార్చుకోలేకపోయింది. కిందటి నెలలో చంద్రబాబు నాయుడు పర్యటించినా దాని ప్రభావం ఏమాత్రం టీడీపీ ఓటుబ్యాంకును రక్షించలేకపోయింది.
నారా లోకేష్ నాయకత్వంపై
ఈ రెండు పరిణామాలు.. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర నిరుత్సాహాన్ని నింపిందనేది బహిరంగ రహస్యం. చివరికి కుప్పం మున్సిపాలిటీని కూడా కోల్పోవాల్సిన దుస్థితి వస్తుందని బహుశా వారు ఊహించి ఉండకపోవచ్చు. చివరి నిమిషంలో నారా లోకేష్ ప్రచారానికి వచ్చారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలను భుజాన వేసుకున్నారు. అయినా ఉపయోగం లేదు. 2019 తరువాత ఏ ఎన్నికలోనూ చంద్రబాబు ఛరిష్మా గానీ, నారా లోకేష్ మంత్రం గానీ టీడీపీని కాపాడలేకపోయింది. నారా లోకేష్ నాయకత్వంపై టీడీపీ క్యాడర్లో అనుమానాలు నెలకొన్నాయి. ఆశలను వదిలేసుకోవాల్సిన పరిస్థితిని కల్పించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.