వైఎస్ జగన్పై మార్ఫింగ్ వీడియో: దేవినేని ఉమాపై కేసు: సీఐడీ స్టేట్మెంట్ ఇదే
కర్నూలు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుపై కర్నూలు జిల్లా సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వీడియోను మార్ఫింగ్ చేశారంటూ ఆయనపై ఫిర్యాదులు అందడంతో అధికారులు కేసు నమోదు చేశారు. ఇన్ఫర్మేషన టెక్నాలజీ చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు పెట్టారు. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ల ఫోర్జరీ, మార్ఫింగ్ నిరోధక సెక్షన్ల కింద దేవినేని ఉమాపై కేసు నమోదైంది.
తిరుపతికి వెళ్లడానికి ఎవరు ఇష్టపడతారు.. అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారంటూ దేవినేని ఉమా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నెల 7వ తేదీన ఆయన ఓ విలేకరుల సమావేశంలో ఈ వీడియోను విడుదల చేశారు. అది మార్ఫింగ్ వీడియో అంటూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కర్నూలుకు చెందిన నారాయణ రెడ్డి అనే అడ్వొకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని, రాజకీయంగా లబ్ది పొందడానికే దేవినేని ఉమా మార్ఫింగ్ చేశారని పేర్కొన్నారు.
వేర్వేరు సందర్భాల్లో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఈ వీడియోలో చేర్చారని చెప్పారు. తిరుపతిలో సౌకర్యాలను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలతో పోటీ పడేలా తీర్చిదిద్దాల్సి ఉందని ముఖ్యమంత్రి ఇదివరకు చేసిన వ్యాఖ్యలను మార్పింగ్ చేసి, ఇందులో పోస్ట్ చేసినట్లు నారాయణ రెడ్డి తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసినప్పటి వీడియోను దీనికి జత చేశారని అన్నారు.
Recommended Video
హైదరాబాద్లోని ఆసుపత్రులకు ధీటుగా తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, అక్కడి సౌకర్యాల కొరత గురించి అధికారులతో మాట్లాడే సమయంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని స్పష్టం చేశారు. నారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ అధికారులు దేవినేని ఉమామహేశ్వర రావుపై కేసు నమోదు చేశారు. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసినందుకు ఐపీసీలోని 464, 465, ఫోర్జరీ ఫర్ ఛీటింగ్ చేసినందుకు 468 కింద కేసు పెట్టారు.