వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా సోకిందంటూ ప్రచారం: డాక్టర్ల పరీక్షలు: ఢిల్లీ ప్రార్థనలతో లింకు
కర్నూలు: రాష్ట్రంలో ప్రాణాంతక కరోనా వైరస్ విస్తరిస్తోంది. రోజురోజుకూ బలపడుతోంది. దీని ఫలితంగా గంటగంటకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా నమోదవుతున్నాయి. మన రాష్ట్రంలో అత్యధిక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల్లో కర్నూలు ఒకటి. శుక్రవారం ఉదయం నాటికి ఈ జిల్లాలో 126 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అత్యధిక కేసులు నమోదైన గుంటూరు జిల్లాతో సమానంగా నిలిచింది.
కర్నూలు జిల్లాలో నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో 80 శాతం వరకు ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదులో నిర్వహించిన తబ్లిగి జమాత్ సామూహిక మత ప్రార్థనలతో ముడిపడి ఉన్నాయంటూ ఇదివరకే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్ మహ్మద్కు కూడా కరోనా వైరస్ సోకిందని, ఆయన ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చారనే ప్రచారం జిల్లాలో కొనసాగింది.

ఈ వార్తలను ఆయన తోసిపుచ్చినప్పటికీ.. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై దాని జోరు తగ్గలేదు. దీనితో హఫీజ్ ఖాన్ కరోనా వైరస్ పరీక్షలను చేయించుకున్నారు. నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని వెల్లడించారు. ఇప్పటికైనా రాజకీయ ప్రత్యర్థులు తనపై సాగిస్తోన్న దుష్ప్రచారాన్ని నిలిపివేయాలని ఎద్దేవా చేశారు. తాను బాధ్యత గల ప్రజా ప్రతినిధినని, తనపై వచ్చిన ఆరోపణలను సవాల్గా తీసుకుని పరీక్షలు చేయించుకున్నానని అన్నారు.
Recommended Video
తన రాజకీయ ప్రత్యర్థులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఢిల్లీ వెళ్లొచ్చాననే వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని అన్నారు. ఢిల్లీలో తబ్లిగి జమాత్ ప్రార్థలకు వెళ్లొచ్చిన వారిని క్వారంటైన్కు పంపించి వైద్యం చేయించానని అన్నారు. కరోనా వంటి సంక్షోభ పరిస్థితుల్లోనూ రాజకీయ ప్రత్యర్థులు తనను ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు.












Click it and Unblock the Notifications