బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి షాక్, క్రిమినల్ కేసు పెట్టిన మంత్రి!
కర్నూలు జిల్లాలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్కు చేరింది. రాయలసీమ రాజకీయాల్లో తనదైన శైలితో దూసుకుపోయే వైసీపీ ఫైర్ బ్రాండ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మంత్రి టీజీ భరత్ ను, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ బైరెడ్డి వదిలిన బాణాలు నేరుగా పోలీస్ స్టేషన్ వరకు చేరాయి. నిలదీస్తే కేసులు పెడతారా అంటూ బైరెడ్డి వేసిన ప్రశ్నలకు ప్రతిగా.. మంత్రి భరత్ కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ పరువునష్టం దావా వేయడం జిల్లావ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.
మే 14న కర్నూలు కలెక్టరేట్ ఎదుట వైసీపీ నిర్వహించిన భారీ ధర్నాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన పంచ్ డైలాగ్స్ తో అధికార పక్షంపై విరుచుకుపడ్డారు. మంత్రి టీజీ భరత్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపాయి. "నాపై విమర్శలు చేసే వారికి మంత్రి భరత్ బహుమతులు ఇస్తున్నారు" అంటూ బైరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, "నాకు టికెట్ రాలేదని మంత్రి మాట్లాడుతున్నారు.. కానీ నాకంటే ఎమ్మెల్యే కావాలనే ఆశ మీకే ఎక్కువగా ఉన్నట్టుంది" అంటూ కౌంటర్లు వేశారు.

ఆత్మహత్య చేసుకున్న సతీష్ కుటుంబానికి ఏ ఫార్మా కంపెనీ నుంచి డబ్బులు వచ్చాయో చెప్పడానికి తాను సిద్ధమని, కాకపోతే తాను చెప్పిన వెంటనే ఆ కంపెనీ నుంచి డబ్బులు ఇవ్వలేదని చెప్పిస్తారంటూ తీవ్ర స్థాయిలో స్పందించారు. టీజీ వెంకటేష్ కూడా తన గౌరవాన్ని కోల్పోయి అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. "మీసాలు తిప్పుకుని తిరిగేవాళ్లు.. ఇప్పుడు మీసాలు దించుకుని మీ దగ్గరకు ఎవరు వచ్చారో చెప్పాలి" అంటూ పరోక్షంగా సవాల్ విసిరారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ బైరెడ్డి చేసిన ఈ కామెంట్స్ మంత్రి వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.
దళిత యువకుడు సతీశ్ కుటుంబానికి న్యాయం చేయండి అని నేను అడిగాను.. దానికి మంత్రి టీజీ భరత్ ప్రెస్మీట్ పెట్టి చెప్పిన సమాధానం వింతగా ఉంది
— YSR Congress Party (@YSRCParty) May 18, 2026
33 ఏళ్లకే నేను వైయస్ఆర్సీపీ తరఫున ఎన్నో నియోజకవర్గాల్లో ప్రచారం చేశాను.. ర్యాలీ, ధర్నాలు చేశాను.
-బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, వైయస్ఆర్… pic.twitter.com/IU8BYQyXYP
రంగంలోకి మంత్రి.. బైరెడ్డిపై 'BNS' సెక్షన్ల కింద కేసు!
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలపై మంత్రి టీజీ భరత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులపై కూడా అవమానకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆయన పోలీసులను ఆశ్రయించారు. బైరెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, నిరాధారమైనవని.. ప్రజల్లో తన ప్రతిష్టను దెబ్బతీసి, ద్వేషభావం కలిగించడానికే ఉద్దేశపూర్వకంగా ఇలా మాట్లాడారని మంత్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మంత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు త్రీ టౌన్ పోలీసులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై 351(2), 352, 353(2), 356(1), 356(2) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తగ్గని మంత్రి.. సివిల్ దావాకు కూడా రెడీ!
ఇప్పటికే క్రిమినల్ పరువునష్టం దావా వేసిన మంత్రి టీజీ భరత్, ఇక్కడితోనే ఆగేది లేదని స్పష్టం చేశారు. త్వరలోనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై 'సివిల్ పరువునష్టం దావా' కూడా వేస్తానని హెచ్చరించారు. చట్టపరంగా పూర్తి స్థాయిలో పోరాడి తీరతానని ఆయన పేర్కొన్నారు.
వైసీపీ ఫైర్ బ్రాండ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్సెస్ మంత్రి టీజీ భరత్ మధ్య మొదలైన ఈ లీగల్ అండ్ పొలిటికల్ వార్తో కర్నూలు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇద్దరు బలమైన యువ నేతల మధ్య మాటల యుద్ధం మున్ముందు మరెన్ని మలుపులు తిరుగుతుందోనని జిల్లా వ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది.














Click it and Unblock the Notifications