కర్నూలే రాజధాని: టిజి, 10లోగా అసెంబ్లీకి: పాల్వాయి
తెలంగాణ ముసాయిదా బిల్లు డిసెంబర్ 10వ తేదీలోగా రాష్ట్ర శాసనసభకు వస్తుందని తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శాసనసభలో మూడు రోజుల పాటు చర్చ ఉంటుందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. సంక్రాంతి లోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పారు.
కృష్ణా నది జలాలపై బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై తెలంగాణ ఏర్పడిన తర్వాత అభ్యంతరాలపై దృష్టి పెడుతామని ఆయన చెప్పారు. బ్రిజేష్ పటేల్ తీర్పు వల్ల రాష్ట్రానికి ఏ విధమైన అన్యాయం జరగలేదని ఆయన అన్నారు. మిగులు జలాలపై ఆధారపడి ప్రాజెక్టులు కట్టవద్దని తాము ఎప్పుడో చెప్పామని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ బిల్లు లోపభూయిష్టంగా ఉందని ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు అన్నారు. రాష్ట్రపతి దాన్ని ఆమోదిస్తే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినట్లేనని ఆయన అన్నారు. అనంతపురం ఎన్జీవో హోంలో ఉద్యోగులతో సమావేశన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కృష్ణా జలాల వినియోగంపై బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్ర రైతులకు అన్యాయం చేసేలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలోనే నీటి సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అన్నారు.