హోదాపై తగ్గం, శ్రీవారి పాదాల వద్ద మోడీ హామీ.. చేస్తారు: జేడీ శీలం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో తగ్గే ప్రసక్తి లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం ఢిల్లీలో చెప్పారు. ప్రత్యేక హోదా పైన తాము ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు మంత్రులకు విజ్ఞప్తి చేస్తామని కాంగ్రెస్ ఎంపీలు జేడీ శీలం, కేవీపీ రామచంద్ర రావు తదితరులు చెప్పారు.
ప్రత్యేక హోదా వంటి ఎన్నో హామీలను బీజేపీ ఇచ్చిందని, మేనిఫెస్టోలోను పెట్టారని వారు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాడు ప్రధాని అభ్యర్థిగా వచ్చి స్వయంగా తిరుమల వేంకటేశ్వర స్వామి పాదాల వద్ద ఏపీకి న్యాయం చేస్తామని చెప్పారని గుర్తు చేశారు.
ప్రధాని మోడీ ప్రత్యేక హోదా పైన అవకాశమిద్దామన్నారు. వారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారనే అనుకుంటున్నామని చెప్పారు. చేయరని ఎందుకు అనుకోవాలని, వారికి సమయం ఇద్దామన్నారు. ఏపీలో ఆర్థిక లోటుతో ఏపీ చంద్రబాబు నాయుడు ఇబ్బందుల్లో ఉన్నారని అభిప్రాయపడ్డారు.
బిల్లులో పొందుపర్చినట్లు ఏపీకి న్యాయం చేయాల్సిందే అన్నారు. బిల్లు ప్రవేశ పెట్టిన సమయంలో కాంగ్రెస్ నేతల కంటే ఎంతో ఎక్కువ ఉత్సాహంతో బీజేపీ హామీలు గుప్పించిందన్నారు. అవన్నీ రికార్డ్ అయ్యాయని చెప్పారు. వాటిని నెరవేర్చాలన్నారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు పొందే హక్కు ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. ఇది అంతం కాదని ఆరంభమన్నారు.
పార్లమెంటులో గందరగోళం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ ఆర్డినెన్స్పై రాజ్యసభలో రగడ నెలకొంది. మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ హమీద్ అన్సారీ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్యసభలో ముక్తార్ అబ్బాస్ నక్వీ ఆర్డినెన్స్ను ప్రవేశపెట్టారు. అయితే సభలో భూసేకరణ బిల్లుపై చర్చకు కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ విపక్షాలు ఒప్పుకోని ఎన్నో ఆర్డినెన్స్లను కాంగ్రెస్ చట్టాలు చేసిందని గుర్తు చేశారు.
ఆర్డినెన్స్లపై ప్రశ్నించే హక్కు కాంగ్రెస్కు లేదని ఆయన అన్నారు. ఆర్డినెన్స్ పేరుతో సభను అడ్డుకోవద్దని జైట్లీ తెలిపారు. యూపీఏ ఒకే అంశంపై మూడు ఆర్డినెన్స్లను తెచ్చిందని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 636 ఆర్డినెన్స్లు వచ్చాయని అందులో 80 శాతం కాంగ్రెస్ తెచ్చినవే అని అరుణ్జైట్లీ గుర్తుచేశారు.