బాబూ! ఇలాగేవుంటే ప్రజలు క్షమించరు: కేవీపీ, వామపక్షాల నిప్పులు, టీ ఎంపీలను చూసైనా..
న్యూఢిల్లీ/విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, వామపక్షాల నేతలు సోమవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారని కేవీపీ మండిపడ్డారు.
అంతేగాక, చంద్రబాబున తీరు రాష్ట్రానికి శాపంగా మారిందని దుయ్యబట్టారు. ఈ మేరకు కేవీపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. నాలుగేళ్లయినా విభజన చట్టంలోని హామీలను అమలు చేయించుకోలేకపోయారని అన్నారు.
ప్రజలు క్షమించరు
దోపిడీ వాటాలు కుదరక ప్రాజెక్టులు ఆలస్యం చేస్తున్నారని, అమరావతిలో శాశ్వత భవనాలకు ఇటుక పేర్చలేదని విమర్శించారు. విభజన చట్టం హామీలపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. చివరి నిమిషంలో బీజేపీపై నిందిలేస్తే ప్రజలు క్షమించరని అన్నారు.
కాంట్రాక్టర్ల రేట్ల కోసం కేంద్రంతో తగాదా?
ఆస్పత్రి పేర దుబాయ్ కంపెనీకి భూములు ఇవ్వడంలో ఉన్న ఆసక్తి.. ఎయిమ్స్ నిర్మాణంపై లేదని కేవీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల రేట్ల కోసం కేంద్రంతో తగాదాపడటం విడ్డూరంగా ఉందని కేవీపీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హేరిటేజ్, బిగ్ బజార్ ప్రయోజనాల కోసం రాజీపడుతున్నారని ఆరోపించారు. విభజనకు కాంగ్రెస్ మాత్రమే కారణం కాదని, టీడీపీ రెండుసార్లు విభజన లేఖలు ఇచ్చిందని చెప్పారు.
చంద్రబాబు చేతకాని తనం వల్లే
కాగా, విజయవాడలో సోమవారం విభజన హామీలపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతూ వామపక్ష నేతలు పీ మధు, రామకృష్ణలు కూడా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేతకానితనం వల్లే విభజన హామీలు అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలపై సుప్రీంకోర్టుకు వెళతానంటూ సీఎం వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
మోడీని బతిమాలే బాబు ఏం చేస్తారు?
చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా కన్నా.. ప్రత్యేక ప్యాకేజీ మిన్న అని స్వయంగా చంద్రబాబే అన్నారని, తెలుగుదేశం అధికార దాహానికి ఏపీ ప్రయోజనాలు పణంగా పెట్టారని మధు మండిపడ్డారు. ప్రధాని మోడీ ఏడాదికిపైగా చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని, అపాయింట్మెంట్ కోసం బతిమిలాడుకున్న వ్యక్తి ఏం పోరాటం చేస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు పోయే ధైర్యం చంద్రబాబుకు లేదని అన్నారు.
తెలంగాణ ఎంపీలను చూసైనా..
హైకోర్టు విభజన కోసం తెలంగాణ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేసి.. వచ్చే జూన్ నాటికి అది సాకారమయ్యేలా హామీ తెచ్చుకున్నారని, ఈపాటి తెగువ కూడా టీడీపీ ఎంపీలకు ఎందుకు లేదు? అని రామకృష్ణ ప్రశ్నించారు. ఆనాడు ప్యాకేజీ ప్రకటనను వ్యతిరేకించి ఉంటే.. ఈనాడు ఈ దుర్గతి పట్టేది కాదని అన్నారు. అప్పుడే విభజన హామీల కోసం ఎందుకు పట్టుబట్టలేదని చంద్రబాబును ప్రశ్నించారు. సుప్రీంకోర్టు అంటూ చంద్రబాబు ఇప్పుడు కొత్త డ్రామా ఆడుతున్నారని రామకృష్ణ విమర్శించారు. దళితులపై దాడులు దారుణమని, ఈ దాడులకు పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ వారు చేశారు. జనవరి 24న గుంటూరుజిల్లా పెదగొట్టిపాడు గ్రామ సందర్శిస్తామని మధు, రామకృష్ణ తెలిపారు.