సభలో మళ్లీ విభజన బిల్లు, బాబు వల్లే మా సభ సక్సెస్: కేవీపీ ట్విస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యూపీఏ ప్రభుత్వం విభజన బిల్లు విషయంలో న్యాయం చేయలేదని టిడిపి, బిజెపి నేతలు విమర్శిస్తున్నారని, అలా అయితే మరోసారి రాష్ట్ర విభజన చట్టం తీసుకు వద్దామని కేవిపి అన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యూపీఏ ప్రభుత్వం విభజన బిల్లు విషయంలో న్యాయం చేయలేదని టిడిపి, బిజెపి నేతలు విమర్శిస్తున్నారని, అలా అయితే మరోసారి రాష్ట్ర విభజన చట్టం తీసుకు వద్దామని రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొత్త ట్విస్ట్
మరోసారి రాష్ట్ర విభజన బిల్లును తీసుకు వస్తే కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని కెవిపి చెప్పారు. టిడిపి, బిజెపి నేతలు రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏమిటో చెబితే విభజన బిల్లును మరోసారి తీసుకు వద్దామని చెప్పారు.
సభ విజయవంతంలో చంద్రబాబు పాత్ర
గుంటూరులో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా సభ విజయవంతం కావడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ సభ విజయవంతానికి కారణమైన చంద్రబాబుకు తాము కృతజ్ఞతలు చెబుతున్నామని వ్యాఖ్యానించారు. సభకు వెళ్లవద్దని చంద్రబాబు కట్టడి చేయడంతో తమ బలం నిరూపించుకున్నామని చెప్పారు.
చంద్రబాబు రెచ్చగొట్టి..
చంద్రబాబు దీక్షల పేరుతో రక్తం వచ్చేలా గంటల తరబడి ప్రసంగిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ సభకు వచ్చిన వారిని దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని ధ్వజమెత్తారు. టిడిపి శ్రేణులను రెచ్చగొట్టి సభను భగ్నం చేయాలని చంద్రబాబు కుట్ర పన్నారన్నారు.
చంద్రబాబు విషసంస్కృతి
టిడిపి శ్రేణుల తీరుతో కాంగ్రెస్ పార్టీలో మరింత ఉత్సాహం వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సభకు వచ్చిన వారిని దేశద్రోహులు అని ముద్ర వేయడం విడ్డూరమన్నారు. రాజకీయాల్లో చంద్రబాబు విష సంస్కృతిని ప్రవేశ పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబును అదే ఏదో ఒకరోజు దహించి వేస్తుందన్నారు.