సభా హక్కుల ఉల్లంఘన: అరుణ్ జైట్లీకి కేవీపీ షాక్, హోదాపై ట్విస్ట్
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా పైన రాజ్యసభలో చర్చ, ద్రవ్య బిల్లు పేరుతో తన ప్రయివేటు మెంబర్ బిల్లును లోకసభకు పంపించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు శుక్రవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిపి తాము రెండు లైన్ల తీర్మానం అనుకున్నామని చెప్పారు. కానీ రాజ్యసభలో తమకు అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను యథాతథంగా అమలు చేయాలని తాము మళ్లీ తీర్మానం ప్రవేశ పెడతామని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 14వ ఆర్థిక సంఘం సూచనల మేరకు హోదా ఇవ్వడం లేదని కేంద్రం చెబుతోన్న విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సభను తప్పుదోవ పట్టించారన్నారు. జైట్లీ పైన తాము సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశ పెడతామని చెప్పారు.

అంతకుముందు సభలో కేవీపీ బీజేపీపై మండిపడ్డారు. తాను ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా బిల్లు పైన పదకొండు పార్టీలు మద్దతిచ్చాయని, వాటికి ధన్యవాదాలు అన్నారు. ప్రయివేటు బిల్లు సభ్యుడి హక్కు అన్నారు. ఏపీకి హోదా ఇచ్చేందుకు చట్టం అవసరం లేదన్నారు.
బీజేపీ దీనిని రాద్దాంతం చేస్తోందన్నారు. తాను ప్రవేశ పెట్టిన బిల్లును మనీ బిల్లు అని చెప్పి బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లును కాదనడం సభ్యుడి హక్కును కాలరాయడమే అన్నారు.
ప్రయివేటు బిల్లు ద్రవ్య బిల్లు కాద్నారు. నాడు ప్రధాని హామీ ఇచ్చినందున ఏపీకి హోదా ఇచ్చేందుకు చట్ట సవరణ అవసరం లేదని చెప్పారు. ఏపీకి హోదా ఇవ్వకండా ఎన్డీయే ఈ అంశాన్ని సంక్లిష్టం చేస్తోందని మండిపడ్డారు.
తాను ప్రవేశ పెట్టిన బిల్లు పైన ఓటింగ్ నిర్వహించాలని, డివిజన్ నిర్వహించాలని కేవీపీ చెప్పారు. ప్రయివేటు బిల్లును ఆమోదించిన తర్వాత ఆర్థిక బిల్లా కాదా తేల్చాలన్నారు. తన బిల్లుకు రాజ్యసభ సెక్రటరియేట్ అనుమతించిందిన్నారు. గతంలో ఈ బిల్లుపై కోరం వాయిదా పడిందన్నారు.












Click it and Unblock the Notifications