టిటిడిపిలో ముసలం, బెదిరించే వారికొద్దని బాబు వద్దకు

దీంతో కమిటీపై పునరాలోచనలో పడటం వల్లనే కమిటిని ప్రకటించడంలో జాప్యం జరుగుతోందని అంటున్నారు. తెలంగాణకు ప్రత్యేకంగా కమిటీని వేయాలని టిటిడిపి ఫోరమ్ కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. అపాయింటెడ్ డేట్ ప్రకటించిన తర్వాతనే తెలంగాణకు కమిటీ వేయనున్నట్టు చంద్రబాబు హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా ఎర్రబెల్లి వెనక్కి తగ్గారు.
అయితే అపాయింటెడ్ డేను కేంద్రం ప్రకటించిన తర్వాత కూడా తెలంగాణకు కమిటీ నియమించకపోవడంతో అసంతృప్తికి గురైన ఎర్రబెల్లి టిటిడిపి ఫోరమ్ కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తూ పార్టీ కార్యాలయానికి ఇటీవల లేఖ పంపించారు. దీంతో చంద్రబాబు ఎర్రబెల్లిని అధ్యక్షునిగా ఐదుగురితో అడ్హాక్ కమిటీని వేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు.
ఇది తెలిసిన టిటిడిపి నేతలు కొందరు చంద్రబాబును కలిసి, తెలంగాణలో టిడిపి అధికారంలోకి వస్తే బిసిని సిఎం చేస్తానని ప్రకటించి, పార్టీ బాధ్యతలను అగ్రవర్గానికి చెందిన ఎర్రబెల్లికి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని అభ్యంతరం చెప్పడంతో కమిటి ప్రకటనను వాయిదా వేశారట. బిసి సామాజిక వర్గానికి చెందిన ఎల్ రమణను తెలంగాణ కమిటీకి అధ్యక్షునిగా నియమించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలిసింది.
కమిటీకి తనను కాకుండా రమణను అధ్యక్షునిగా చేయడం ఏమిటని ఎర్రబెల్లి మళ్లీ బాబును కలిసి అభ్యంతరం చెప్పారంటున్నారు. అలా చేస్తే పార్టీని వదిలిపెడతానని ఎర్రబెల్లి హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో తెలంగాణ కమిటికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎర్రబెల్లిని, అధ్యక్షునిగా ఎల్ రమణను నియమించాలని తాజాగా చంద్రబాబు నిర్ణయించారట. దీని పైనా టిటిడిపి నేతలు కొందరు మళ్లీ తీవ్ర అభ్యంతరం తెలియజేశారట.
తెలంగాణకు బిసిని సిఎం చేస్తామన్న హామీకి అనుగుణంగా కమిటీని నియమించాలని, ఎర్రబెల్లి వంటి బెదిరించే వారికి బాధ్యతలు అప్పగిస్తే పార్టీ ఇచ్చిన హామీ స్ఫూర్తి దెబ్బతింటుందని నేతలు మళ్లీ అభ్యంతరం చెప్పారట. ఎర్రబెల్లికి కమిటీలో పెద్దపీట వేస్తే వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోమని టిటిడిపి సీనియర్లు మండవ వెంకటేశ్వర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు, రేవంత్ రెడ్డి తేల్చి చెప్పడంతో కమిటీ నియామకాన్ని మళ్లీ వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.
కమిటీ అంశం సున్నితంగా మారడంతో తెలంగాణ కమిటి మళ్లీ వాయిదా పడిందంటున్నారు. తెలంగాణ కమిటీ అంశాన్ని మీడియా సమావేశంలో చంద్రబాబును ప్రశ్నించగా, పార్టీ విధానానికి అనుగుణంగానే కమిటీని నియమిస్తామని, కొంతమంది ఎంతో కృషి చేసారని, అలాంటి వారికి మరోరకంగా ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఎర్రబెల్లికి కమిటీ పగ్గాలు అప్పగించకుండా బిసిని సిఎంను చేస్తామన్న హామీకి అనుగుణంగానే కమిటీ వేయనున్నట్టు చంద్రబాబు నర్మగర్భంగా చెప్పారు.












Click it and Unblock the Notifications