చంద్రబాబుతో భేటీ: లగడపాటి టిడిపిలో చేరుతారా?
న్యూఢిల్లీ: కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని గురువారంనాడు కలుసుకున్నారు. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి చోటు చేసుకుంది. తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంలో భాగంగానే లగడపాటి చంద్రబాబుతో భేటీ అయినట్లు భావిస్తున్నారు.
లగడపాటి రాజగోపాల్ తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని అప్పట్లో ఆయన ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఇంత కాలం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే, ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆయన పావులు కదుపుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, ఊహాగానాల్లో ఏ మేరకు నిజం ఉందనేది ఇప్పుడే చెప్పడం సులభం కాకపోయినప్పటికీ చంద్రబాబు లగడపాటిని తీసుకునేందుకు సముఖత వ్యక్తం చేయవచ్చునని అంటున్నారు.
రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన లగడపాటి రాజగోపాల్ రాజకీయాలకు దూరంగా ఉంటూ 2014 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీకి సహకారం అందించారు. అయితే, ఆ పార్టీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.












Click it and Unblock the Notifications