లగడపాటికి జగన్ భయం, ఆంక్షలపై రాజీ లేదు: కెసిఆర్
హైదరాబాద్: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ భయం పట్టుకుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. తెలంగాణ గ్రూప్ వన్ అధికారుల డైరీని ఆయన మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిది ఏం పాలనో అర్థం కాదని ఆయన అన్నారు. రాష్ట్రపతి నుంచి తెలంగాణ ముసాయిదా బిల్లు శాసనసభకు వచ్చిందని, తెలంగాణ ఏర్పడడం ఖాయమని ఆయన అన్నారు.
ఇది దుఖ్కం, సంతోషం కలగలసిన సమయమని, తెలంగాణ ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మరో యుద్ధానికి సిద్ధం కావాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు కోరిన సంపూర్ణ తెలంగాణ కావాలని, ఆంక్షలతో కూడిన తెలంగాణను తాము అంగీకరించబోమని ఆయన అన్నారు. 1919లో నిజాం కల్పించిన రక్షణే ముల్కీ నిబంధనలని, వాటిని తుంగలో తొక్కి 24 వేల ఉద్యోగాలను ఆంధ్రులు కొల్లగొట్టారని ఆయన అన్నారు. ఎక్కడి ఉద్యోగులు అక్కడే ఉండాలంటే ఇక తెలంగాణ ఎందుకని ఆయన అడిగారు. ఇన్నాళ్లు ఉద్యోగాలు కొల్లగొట్టారు, ఇప్పుడు పించన్లు ఇచ్చి సాకాలా అని ఆయన అడిగారు. ఒకరు చేసిన తప్పునకు మరొకరు అనుభవించాలా అని ఆయన అడిగారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని గౌరవించాల్సిందేనని, అయితే ఆంక్షలు లేని తెలంగాణ తమకు కావాలని ఆయన అన్నారు. సీమాంధ్రకు మరో లక్ష ఇచ్చుకోండి గానీ తాము మాత్రం ధర్మం, న్యాయం కోరుతున్నామని ఆయన అన్నారు. తాము ఎవరి కోసం రాజీపడాలని, తమను దోపిడీని చేసిన ఆంధ్రవాళ్ల కోసం రాజీ పడాలా అని కెసిఆర్ అడిగారు. 1985లో రాయలసీమ నుంచి తెలంగాణ ఉద్యోగులను తరిమికొట్టారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణకు సంబంధించి నాలుగు అంశాలు ప్రమాదకరంగా ఉన్నాయని ఆయన చెప్పారు. సవరణలను చేసిన ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారు.
తమ నెత్తి మీద గవర్నర్ పాలన ఎందుకని, తమకు పాలన చేసుకోవడం చేత కాదా అని ఆయన అడిగారు. తెలంగాణపై ఇన్ని ఆంక్షలు ఎందుకని ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్ను ప్రశ్నించారు. తమ ఉద్యమ ప్రాతిపదికనే నీళ్లు, నిధులు, నియామకాలని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్ చెవిలో పోరు పెట్టి తెలంగాణపై ఆంక్షలు పెట్టించారని ఆయన విమర్సించారు. ఆంధ్రలో మేధావులు ఒక్కరైనా ఉన్నారా అని అడిగారు. ఆంధ్రవాళ్లు ఇష్టారాజ్యంగా చేస్తుంటే ఊరుకోవద్దని ఆయన అన్నారు. ఆంక్షలతో కూడిన తెలంగాణకు అంగీకరిస్తే తనను మరో చెన్నారెడ్డి అంటారని ఆయన అన్నారు. ఆంక్షలు లేని తెలంగాణ కోసం జనవరి 3వ తేదీన హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద 25 వేల మందితో ధర్నా చేయాలని ఆయన పిలుపునిచ్చారు.