కేంద్రాన్నికూల్చేస్తాం: ఊగిపోయిన లగడపాటి, జగన్పైనా
న్యూఢిల్లీ: తాము యూపిఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శుక్రవారం చెప్పారు. ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. దత్తపుత్రుడిని, వేర్పాటువాదిని నమ్ముకొని కాంగ్రెసు పార్టీ తమను చులకన చేసిందన్నారు. కేంద్రం మైనార్టీలో ఉందన్నారు. తాము ఆరుగురం ప్రస్తుతానికి మద్దతు ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రపతికి లేఖ ఇస్తామన్నారు.
పది మంది వరకు అయితే కేంద్రం కూలిపోవడం ఖాయమని, తద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగిపోతుందన్నారు. తమకు కనీస సమయం ఇవ్వకుండా హడావుడిగా బిల్లును ఆమోదించారని ధ్వజమెత్తారు. తమను అవమానించి, ఇష్టానుసారంగా కాంగ్రెసు పార్టీ వ్యవహరించిందన్నారు. కీలకమైన తెలంగాణ అంశాన్ని టేబుల్ ఐటెంగా తీసుకున్నారని ధ్వజమెత్తారు. మా దగ్గర అస్త్రాలు ఇంకా ఉన్నాయన్నారు.
యూపిఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునేందుకు తాము డ్రాఫ్ట్ లేఖను తయారు చేస్తున్నామన్నారు. మద్దతు ఉపసంహరిస్తే ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేయవచ్చున్నారు. సీమాంధ్ర కేంద్రమంత్రుల చిన్న చిన్న కోరికలను కూడా పట్టించుకోలేదని విమర్శించారు. తమను పూచికపుల్లలా తీసిపారేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్వేషాలు రగిల్చిన వారు పండుగ చేసుకుంటున్నారన్నారు.
దత్తపుత్రుడు, వేర్పాటువాదులు దొరికారు కాబట్టి తమ పార్టీ అధిష్టానం మెగాస్టార్ చిరంజీవిని, మూడు తరాలుగా కాంగ్రెసుకు సేవలు అందించిన పళ్లం రాజు, కావూరి సాంబశివ రావు, జెడి శీలంలను, నందమూరి తారక రామారావు కుమార్తె పురంధేశ్వరిని కాదని, తమను పూచికపుల్లలా తీసేశారని ధ్వజమెత్తారు. తాము ఉంటే ఎంత పోతే ఎంత అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. చీకటి ఒప్పందం జరిగింది కాబట్టే ఇంత దారుణానికి ఒడిగట్టారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉండాల్సిందే అన్నారు. విభజన ప్రక్రియను ఆపే భాగంలో కిరణ్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.