గడ్డి తింటున్నారు: టీపై లగడపాటి, యుటి: రాయపాటి
విజయవాడ/ గుంటూరు: ముఖ్యమంత్రి పదవికోసం తమ పార్టీకి చెందిన నాయకులు అడ్డమైన గడ్డి తింటున్నారని విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ఆయన కాంగ్రెసు నాయకులపై శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సమైక్య రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. పదవుల కోసం గుడులు కట్టేవారు పదవులు రాకపోతే గుడులను కూడా పగులగొడతారని ఆయన అన్నారు.
తాను విభజనకు వ్యతిరేకమని, రాష్ట్ర విభజన తప్పకపోతే హైదరాబాద్ - సికింద్రాబాద్ మెట్రో అథారిటీతో కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని గుంటూరు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అన్నారు. కాంగ్రెసు తమ విధానం ఇదని స్పష్టంగా చెప్పడం లేదని ఆయన గుంటూరులో శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి కొంత మంది గుడులు కడుతున్నారని, పదవులు రాకపోతే ఆ గుడులను వారే కూల్చేస్తారని లగడపాటి అన్నారు.

రాష్ట్ర విభజనకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు వ్యతిరేకమని ఆయన చెప్పారు. కాంగ్రెసు అధిష్టానం విభజనపై స్పష్టమైన విధానం ప్రకటించకుండా సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజనకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, కాంగ్రెసు పార్టీ కారణమని కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుడు వైయస్ వివేకానంద రెడ్డి అన్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి సీమాంధ్ర నేతలు, ప్రజలు బలయ్యారని ఆయన శనివారం మీడియాతో అన్నారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎన్ని అవాంతారాలు ఎదురైనా తాను కాంగ్రెసును వీడబోనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications