జైపాల్రెడ్డికి లగడపాటి లేఖ, ఢిల్లీలో అశోక్ బాబు
న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి విజయవాడ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ బుధవారం ఓ లేఖ రాశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేట్టు మాట్లాడడం బాధకరమని, దేవుళ్లు, దేవాలయాలకు మధ్య కూడా గోడ కట్టే వాదం తగదని జైపాల్ రెడ్డికి ఆ లేఖలో సూచించారు. భద్రాది రామయ్య చాలు, మిగతా దేవుళ్లు వద్దనుకోవడం ఏ రకమైన లౌకిక సూత్రమో ఆయనకే అర్థం కావాలని లగడపాటి తన లేఖలో పేర్కొన్నారు.

అన్యాయం జరగకూడదనే మా ఉద్దేశం: అశోక్ బాబు
ఒక ప్రాంతం కోసం మరో ప్రాంతానికి అన్యాయం చేయడం సరికాదని, సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలనేదే తమ ఉద్దేశమని ఏపిఎన్జిఓ అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. బుధవారం భారతీయ జనతా పార్టీ, జెడిఎస్, జెడియు, సిపిఐ నేతలను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ పార్టీల నేతలతో తమ సమస్యలను వివరించినట్లు అశోక్ బాబు తెలిపారు.
ముసాయిదా బిల్లు వచ్చాక చర్చిస్తామని బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ చెప్పారని తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తామని మాజీ ప్రధాని దేవేగౌడ చెప్పారని అన్నారు. తెలంగాణ బిల్లు ముందుకు వెళ్లలేదనే నమ్మకం తమకుందని, రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే తాము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని అశోక్బాబు తెలిపారు.
ముందుగా భద్రాచలం సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. అసెంబ్లీలో విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు అభిప్రాయం చెప్పాలని, ఇచ్చిన మాటకు ఎమ్మెల్యేలు కట్టుబడి ఉండకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని అన్నారు. గురువారం సిపిఎం జాతీయ నేతలను కలుస్తామని చెప్పారు.
కంటి తుడుపు చర్యగా అఖిలపక్షం: కిషన్ రెడ్డి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశం కంటితుడుపుగా ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. విభజన సందర్భంగా స్పష్టత కోసం 11 అంశాలపై జిఓఎం వద్ద ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడం కేంద్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే బిజెపి మద్దతిస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే నీటి పంపకాలు, ఉద్యోగాలు, సీమాంధ్రుల భయాలు తొలగించేందుకు కేంద్రం భరోసా ఇవ్వాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ అఖిలపక్ష సమావేశానికి హాజరుకాకపోవడం ఆ పార్టీ వైఫల్యమేనని అన్నారు.












Click it and Unblock the Notifications