ఎన్టీఆర్, వైయస్ల ఆశయాలతో జగన్: లక్ష్మీపార్వతి
రెండుకళ్ల సిద్ధాంతం చెబుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారని అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటంలో చంద్రబాబు కొట్టుకుపోతారని లక్ష్మీపార్వతి అన్నారు. తెలంగాణ ప్రజలు గతంలో పెత్తందారులు, భూస్వాముల పాలనలో అనేక కష్టాలు అనుభవించారని తెలిపారు. సమైక్య రాష్ట్రంలోనే వారికి న్యాయం జరుగుతోందని ఆమె అన్నారు.
సమైక్య రాష్ట్రం కోసం ఇక్కడి ప్రజలు సహకరించాలని నమస్కరించి వేడుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ భారతంలో సైంధవుడిలా రాష్ట్రాన్ని విభజిస్తున్నాడని ఆమె ఆరోపించారు. సీమాంధ్ర ప్రజలు చెన్నపట్నాన్ని, బళ్లారిని, కృష్ణపట్నాన్ని వదులుకున్నారని, ఇప్పుడు హైదరాబాద్ ను కూడా వదులుకోవాలంటున్నారని అన్నారు.
సమైక్యంగా ఉంచగలరనే జగన్ పార్టీలోకి: విశ్వరూప్
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలరని నమ్మాను కాబట్టే కాంగ్రెస్ పార్టీ, మంత్రి పదవికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని మాజీ మంత్రి విశ్వరూప్ అన్నారు. జగన్ మాత్రమే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలరని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత సీమాంధ్రలో ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోందని ఆయన అన్నారు. సుమారు 87రోజులుగా సీమాంధ్ర ప్రజలు రోడ్లపైనే ఉంటున్నారని అన్నారు. సీమాంధ్రలో వ్యవస్థ స్తంభించిపోయిందని అన్నారు.
ఏపి ఎన్జీవోలు, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, మహిళలు, యువకులు ఉద్యమంలో పాల్గొంటున్నారని అన్నారు. వారందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. దసరా తర్వాత ఆర్టీసీ, తుపాను కారణంగా ఉద్యోగ సంఘాలు సమ్మె విరమించాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన కారణంగానే కాంగ్రెస్ విభజన ప్రక్రియ చేపట్టిందని అన్నారు.
వైయస్ జగన్ తొలిసారి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనప్పుడే సమైక్యాంధ్రకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉంటే రాష్ట్రాన్ని ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొని ఉండేది కాదని అన్నారు. ఆయన తనయుడు జగన్ నాయకత్వంలో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.