లక్ష్మీ పార్వతి..పూనం కౌర్ కేసు : ఇద్దరినీ వేధించింది ఒక్కరే : గుర్తించిన సైబర్ పోలీసులు..!
మహిళా ప్రముఖులను వేధిస్తున్న వారిని సైబర్ పోలీసులు గుర్తించారు. లక్ష్మీ పార్వతి..పూనం కౌర్ను సోషల్ మీడియా వేదికగా వేధించింది ఒక్కరేనని తేల్చారు. దీనికి సంబంధించి ప్రాధమిక ఆధారాలు సేకరించారు. ఎందుకు వారు ఈ ఇద్దరినీ లక్ష్యంగా చేసుకున్నారనే అంశం పైన పోలీసులు విచారణ చేస్తున్నారు.
లక్ష్మీపార్వతి..పూనం కౌర్ కేసుల్లో..
వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న లక్ష్మీ పార్వతి..సినీ నటి పూనం కౌర్లను సోషల్ మీడియా వేదికగా వేదించిన వారిని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇద్దరినీ వేధించింది ఒక్కరేనని తేల్చారు. ఈ మేరకు సైబర్ పోలీసులు ప్రాధమిక ఆధారాలు సేకరించారు. తమ వ్యక్తిగత ప్రతిష్ఠనున దెబ్బతీసేందుకు ఉద్దేశ పూర్వకంగా కొందరు ఫేస్బుక్, యూట్యూబ్ ఛానళ్లలో అసభ్య కధనాలు పోస్టు చేస్తున్నారంటూ లక్ష్మీ పార్వతి..పూరం కౌర్ ఇద్దరూ వేర్వేరుగా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. వీరి ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేసిన పోలీసులు ఇద్దరినీ వేధిస్తున్నది ఒక్కరేనని గుర్తించారు. అయితే, పోలీసులు నిందితుడిని గుర్తించినా..ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆ వ్యక్తికి మరొకరు తోడుగా ఉన్నట్లు విచారణలో తేలింది. హైదరాబాద్లోని ఫిలింనగర్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ నుండి వాళ్లు తమ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తేల్చారు.

ఎందుకు చేసారంటే..
అసలు వీరు ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకొని మరీ ఈ విధంగా అసభ్య కధనాలు పోస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. వీరి వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. లక్ష్మీపార్వతిపై ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి, పూనం కౌర్పై గత 8 నెలలుగా అసభ్య వ్యాఖ్యలు, అశ్లీల కథనాలను పోస్ట్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. అయితే వీరిద్దరి మీద ఈ కధనాలు వచ్చే సమయంలో వారి పైన వచ్చిన ఆరోపణలు..రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాల ఆధారంగానూ పోలీసులు ఆలోచన చేస్తున్నారు. ఫిలింనగర్ లాంటి ప్రాంతంలో కార్యాలయం నిర్వహిస్తున్నారంటే..వారికి ఆర్దికంగా ఎవరైనా తోడ్పాటు అందిస్తుండాలని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజకీయాల్లో భాగంగా ఇటువంటి వేధింపులు వెనుక ఉండి చేయిస్తున్నారా అనే కోణంలోనూ లోతుగా విచారణ సాగుతోంది.












Click it and Unblock the Notifications