కెసిఆర్కు షాక్: మెదక్ బిజెపి అభ్యర్థిగా లక్ష్మీరాజం?
హైదరాబాద్: నమస్తే తెలంగాణ దినపత్రిక చైర్మన్ లక్ష్మీరాజం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు షాక్ ఇచ్చినట్లు భావిస్తున్నారు. నమస్తే తెలంగాణ యాజమాన్యం మారుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో లక్ష్మీరాజం ఢిల్లీలో బిజెపిలో చేరారు. నిజానికి, లక్ష్మీరాజాన్ని రాజ్యసభకు పంపిస్తామని కెసిఆర్ గతంలో చెప్పారు.
కానీ, కెసిఆర్ హామీని తోసిపుచ్చే విధంగా లక్ష్మీరాజం బిజెపిలో చేరారు. ఆయన మెదక్ లోకసభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. మెదక్ లోకసభ స్థానం నుంచి కెసిఆర్ విజయం సాధించి, దానికి రాజీనామా చేశారు. దాంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానం నుంచి తెరాస నుంచి ఎవరిని పోటీకి దించుతారనేది ఊహకు కూడా అందడం లేదు. అయితే, ఆ స్థానం నుంచి పోటీ చేయడానికి చాలా మందే పోటీ పడుతున్నారు. మైనంపల్లి హనుమంతరావు నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు.

అయితే, కాంగ్రెసు నుంచి మెదక్ శాసనసభా స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విజయశాంతిని గానీ సంగారెడ్డి శానససభా స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన జగ్గారెడ్డిని గానీ పోటీకి దిగవచ్చునని అంటున్నారు. ఈ స్థితిలో లక్ష్మీరాజం మెదక్ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తారని అంటున్నారు.
దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గాలి వీస్తున్న స్థితిలో కాకుండా అధికారంలో బిజెపి ఉన్నందున మెదక్ నుంచి పోటీ చేస్తే విజయం దక్కుతుందనే ఉద్దేశంతో లక్ష్మీరాజం ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications