నవ్యాంధ్రలో భూసేకరణ చట్టం: నోటిఫికేషన్ జారీ, ధర్నాకు పిలుపునిచ్చిన విపక్షాలు
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని ప్రయోగించింది. ల్యాండ్ పూలింగ్ కింద రాజధాని పరిసర గ్రామాల పరిధిలో ఇప్పటికే ప్రభుత్వం 33,400 ఎకరాల భూమిని సేకరించింది. మరో 3,892 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండటంతో ప్రభుత్వం భూసేకరణ చట్టానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే శుక్రవారం ఉదయం దీనికి సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. జీవో నెం. 304 పేరిట జారీ అయిన ఈ జీవోలో అమరావతి పరిధిలోని తుళ్లూరు(2), శాఖమూరు, బోరుపాలెం, పిచుకలపాలెం, అనంతవరం, నేలపాడు, ఐనవోలు, అబ్బురాజుపాలెం, దొండపాలెం, కొండమరాజుపాలెం రెవెన్యూ గ్రామాలున్నాయి.

ఈ గ్రామాల పరిధిలోని భూములను సేకరించేందుకు ప్రభుత్వం 26 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను రంగంలోకి దించింది. శనివారం మరో 19 గ్రామాలకు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. భూసేకరణ చట్టం నోటిఫికేషన్ జారీతో రాజధాని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.
మరోవైపు భూసేకరణ నోటిఫికేషన్ జారీపై విపక్షాలు భగ్గమన్నాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సహా విపక్షాలు కాంగ్రెస్, వామపక్షాలు కూడా భూసేకరణ చట్టం నోటిఫికేషన్పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. రాజధాని నిర్మాణం కోసం రైతులను నుంచి బలవంతంగా భూములు లాక్కునేందుకే భూసేకరణ చట్టం నోటిఫికేషన్ను జారీ చేసిందని ఆరోపించారు.
ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్ష పార్టీలు శుక్రవారం సీఆర్డీఏ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతున్నట్లు ప్రకటించాయి.












Click it and Unblock the Notifications