ఎపి రాజధానికి భూసేకరణ: పవన్ కళ్యాణ్ రియాక్షన్పైనే...
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూములు స్వచ్ఛందంగా ఇవ్వడానికి నిరాకరించిన రైతులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరడా ఝళిపించబోతోంది. వారి నుంచి భూములు సేకరించడానికి అవసరమైన అస్త్రాన్ని సిద్ధం చేసుకుంది. బలవంతంగా భూములు తీసుకుంటే సహించబోనని చెప్పిన జనసేన అధినేత, తెలుగు సినీ హీరో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఆయన ప్రతిస్పందనపై ఉత్కంఠ నెలకొని ఉంది.
రాజధాని కోసం ప్రభుత్వం భూసేకరణ కోసం 166 జీవోను విడుదల చేసింది. బలవంతంగా ఎవరి భూముల జోలికి వెళ్ళినా ఊరుకునేది లేదని తేల్చి చెప్పిన జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తారు, ఇచ్చిన మాట మేరకు రైతుల తరపున పోరాడుతారా? అనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.
భూసేకరణ కోసం 166 జీవో మే 15వ తేదీ నుంచే ఈ ప్రక్రియ అమలులోకి వస్తుందని తెలిపింది. రైతులు అంగీకరించకుంటే భూసమీకరణ, లేదంటే భూసేకరణ అనే పద్ధతిలో ముందుకు సాగిపోవాలని ఏర్పాట్లు చేసుకుంది. అయితే రాజధానికి అవసరమైన భూసేకరణ విషయంలో రైతుల నుంచి భూములను వారి ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో అన్నారు.
రెండు నెలల కింద ఆ ప్రాంతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులకు అండగా నిలుస్తానని తేల్చిచెప్పారు. చాలా మంది రైతులు భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఎలాగైనా తీసుకుని తీరాల్సిందేనని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడతారా? లేక చూసీచూడనట్లు వ్యవహరిస్తారా? అనేది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. పవన్ కళ్యాణ్ ప్రతిస్పందన ఎలా ఉంటుందనే విషయంపై చర్చ సాగుతోంది.