భూసేకరణపై వెనక్కి తగ్గం: రాజధానిపై నారాయణ
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూసేకరణ విషయంలో కొన్ని గ్రామాలకు మినహాయింపు ఇచ్చే ప్రసక్తి లేదని, ప్రభుత్వ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గబోమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని ప్రాంత పరిధిలో 7231 ఎకరాల భూమి సమీకరించినట్టు సిఆర్డిఏ వైస్ చైర్మన్, రాష్ట్ర మంత్రి కె నారాయణ, కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు. తుళ్లూరు సిఆర్డిఏ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి, కమిషనర్ మాట్లాడారు.
జనవరి నెలాఖరుకు 10 వేల ఎకరాలు సమీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి 10నాటికి 18వేల ఎకరాల భూమి సమీకరించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్టు చెప్పారు. ప్రపంచంలోనే అతితక్కువ సమయంలో ఇన్ని వేల ఎకరాల భూమిని సమీకరించిన ఘనత రాష్ట్రానికే దక్కుతుందన్నారు. డిప్యూటీ కలెక్టర్ల నియామకాలను ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు 11మంది విధి నిర్వహణలో పాల్గొనగా మిగిలిన 18మంది రెండురోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తారన్నారు.
డిప్యూటీ కలెక్టర్లు బాధ్యతలు చేపట్టిన తరువాత భూసమీకరణ మరింత వేగవంతం అవుతుందన్నారు. రాజధాని ప్రాంత పరిధిలోని గ్రామాల రైతులకు సంబంధించిన రుణమాఫీ వ్యవహారంపై సిఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మరో రెండురోజుల్లో రుణమాఫీ విధివిధానాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.
పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు గ్రామాల రైతులు తమ భూములకు సమీకరణ నుంచి మినహాయింపు కావాలని కోరుతున్న విషయాన్ని మంత్రి నారాయణ దృష్టికి మీడియా తీసుకువెళ్ళగా, ప్రభుత్వం ఒక్కసారి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోదని సమాధానమిచ్చారు. ప్రభుత్వ నిర్ణయానుసారం రైతులంతా సహకరించి ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి సుముఖం వ్యక్తం చేయాలన్నారు. సింగపూర్లో శిక్షణ పొందిన అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం వివరాలను ఆందజేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.