వెంకయ్య శిష్యుడి పగ్గాలకు బ్రేక్ - అడ్డుకుందెవరు, ఢిల్లీ ట్విస్ట్..!!
ఏపీలో బీజేపీ అధ్యక్ష మార్పు వెనుక కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. 2018లో బీజేపీతో తెగిపోయిన పొత్తు బంధాన్ని తిరిగి కొనసాగించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. ఇప్పటికీ ఈ అంశం పైన స్పష్టత లేదు. ఈ సమయంలోనే పురందేశ్వరి బీజేపీ ఏపీ చీఫ్ గా నియామకం వెనుక కొత్త లెక్కలు మొదలయ్యాయి. చివరి నిమిషం వరకు ప్రచారంలో ఉన్న పేర్లను కాదనటం వెనుక ఆసక్తి కర అంశాలు వెలుగు లోకి వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగింది.
పురందేశ్వరి ఎంపిక వెనుక:ఏపీలో నూతన బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి నియమితులయ్యారు. ఇప్పటి వరకు కొనసాగిన సోము వీర్రాజును తప్పించారు. కొద్ది రోజులుగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలే...ఫిర్యాదుల క్రమంలో సోమును తప్పించారని తెలుస్తోంది.

కొద్ది రోజులుగా రాష్ట్రంలో తిరిగి 2014 పొత్తులు ఖాయమనే విధంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఓపెన్ గా చెప్పారు. ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతల ముందు ప్రతిపాదన చేసారు. ఢిల్లీలో అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు సమావేశం తరువాత ఈ ప్రచారం పెరిగింది. కానీ, ఇప్పటికీ టీడీపీతో పొత్తు పైన బీజేపీ తేల్చలేదు. ఈ సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు పురందేశ్వరికి అప్పగించారు.
సత్యకుమార్ కు బ్రేక్:ఏపీలో బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఈ సారి సత్య కుమార్ కు అప్పగిస్తారని ప్రచారం సాగింది. చివరి నిమిషం వరకు ఆ పేరే రేసులో నిలిచింది. వైసీపీ ప్రభుత్వం పైన తీవ్రంగా మండిపడుతూ..పార్టీ వాయిస్ వినిపిస్తున్న సత్య కుమార్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే టీడీపీతో పొత్తు ఖాయమనే అంచనాలు వ్యక్తం అయ్యాయి.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు బీజేపీలో క్రియాశీలకంగా ఉన్న సమయం నుంచి సత్య కుమార్ ఆయన వద్దే ఉన్నారు. వెంకయ్య ఉప రాష్ట్రపతి అయిన తరువాత పార్టీలో క్రియాశీలకంగా మారారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలతో సత్య కుమార్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ, చివరి నిమిషంలో సత్యకుమార్ను రాష్ట్ర అధ్యక్షుడిని చేయడాన్ని జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ వ్యతిరేకించారని సమాచారం.
టీడీపీతో పొత్తు ఉన్నట్లా..లేనట్లా:రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాలని బీజేపీ నిర్ణయంలో భాగంగానే పురందేశ్వరి ఎంపిక జరిగిందనే విశ్లేషణలు మొదలయ్యాయి. జగన్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న సత్యకుమార్ను కాదని, మధ్యేమార్గంగా పురందేశ్వరిని నాయకత్వం ఎంచుకుందని బీజేపీ వర్గాలు కూడా అంటున్నాయి. సీఎం జగన్ ఢిల్లీ వస్తున్న నేపథ్యంలో ఆమె నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డి కూడా వెంకయ్య నాయుడు శిష్యుడే. కానీ, కాంగ్రెస్ కు సారధ్యం వహిస్తున్న నేత రెడ్డి వర్గం కావటం..తెలంగాణ పార్టీలో విభేదాలు.. అక్కడి సామాజిక సమీకరణాల్లో భాగంగా కిషన్ రెడ్డిని ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. పురందేశ్వరి నియామకం తరువాత బీజేపీలో చోటు చేసుకొనే పరిణామాలపైన ఆసక్తి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications