గుంటూరులో ఓ లాయర్ పైశాచికం: నగ్నచిత్రాలు నెట్లో పెడతానని బెదిరింపు
అమరావతి: భర్తతో విభేదాలు వచ్చి న్యాయం చేయాలని ఓ న్యాయవాదిని ఆశ్రయిస్తే.... తప్పుడు విడాకుల పత్రాలతో తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఓ మహిళ సోమవారం గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ్ నాయక్కు ఫిర్యాదు చేసింది. బాధితురాలు నరసరావుపేట మండలంలోని అల్లూరివారిపాలెంకు చెందిన నడిపినేని శోభారాణి.
ఎస్పీకి బాధితురాలు ఫిర్యాదు చేసిన వివరాలిలా ఉన్నాయి. శోభారాణికి అదే గ్రామానికే చెందిన కోటిస్వామి రమేష్తో 1994లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. శోభారాణి గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తోంది. పెళ్లైన పదేళ్ల తర్వాత తన భర్తతో మనస్పర్థలు వచ్చాయి.
వీటి పరిష్కారం కోసం నరసరావుపేటకు చెందిన న్యాయవాది కూరపాటి గోపాలకృష్ణను ఆశ్రయించింది. ఆమె నుంచి రూ. 30 వేలు తీసుకున్న గోపాలకేృష్ణ, తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ వేసినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఆమెను తన ఆఫీసు చుట్టూ తిప్పుకోసాగాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య కాస్త సన్నిహిత్యం పెరిగింది. తన భార్యతో తనకూ విభేదాలు వచ్చాయని, 2010లో తాను కూడా విడాకులు తీసుకున్నట్లు తప్పుడు పత్రాలు చూపాడు. ఇంగ్లీషు రాకపోవడంతో అది నిజమేనని ఆమె నమ్మింది. ఇద్దరం విడాకులు తీసుకున్నాం కదా పెళ్లి చేసుకుందామని ప్రాధేయపడటంతో అందుకు ఆమె అంగీకరించింది.
2013 నవంబర్ 14న శోభారాణిని తిరుపతి తీసుకువెళ్లి అతని స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. తర్వాత నరసరావుపేటలోని రామిరెడ్డిపేటలో కాపురం పెట్టారు. కొన్ని రోజులపాటు సాఫీగా వీరి జీవితం సాగింది. ఆ తర్వాత శోభారాణి వద్ద ఉన్న రూ.లక్ష 83వేలు తీసుకొని ముత్తూట్ ఫైనాన్స్లో నగలు విడిపించుకున్నాడు.
శోభారాణి అంగన్ వాడీ టీచర్ కావడంతో అవసరం వచ్చినప్పుడల్లా ఆమె వద్ద నుంచి డబ్బు తీసుకునేవాడు. ఇలా శోభారాణి నుంచి రూ.4లక్షల వరకూ తీసుకొని ఇంకా డబ్బు తేవాలని అడుగుతుండటంతో పుట్టింటి వారిని అడుగలేక, గోపాలకృష్ణకు డబ్బు ఇవ్వలేక ఆమె శారీరకంగా మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురైంది.
చివరకు గోపాలకృష్ణ వేధింపులు తట్టుకోలేక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని చెప్పగా నీకు చేతనైంది చేసుకోపో అని అన్నాడు. అంతేకాదు తన భార్యతో విడాకులు తీసుకున్నట్లు చూపిన పత్రాలు, నీ భర్తనుంచి విడాకులు వచ్చినట్లు చూపిన పత్రాలు తాను సృష్టించినవేనని, నీవు నా భార్యవు కాదని, ఎవరికి ఫిర్యాదు చేసినా భయం లేదంటున్నాడు.
ఇంకా డబ్బు ఇవ్వాలని బెదిరించడమేకాక విషయం ఎవరికైనా చెబితే తాను తీసిన నగ్న చిత్రాలను ఇంటర్నెట్లో పెట్టి పరువు తీస్తానని బెదిరిస్తున్నాడు. గోపాలకృష్ణ గురించి ఎవరికైనా చెబితే యాసిడ్ పోసి చంపుతామని పాతూరుకు చెందిన మంచాల మౌళి, అతని తమ్ముడు రవి బెదిరిస్తున్నట్లు రూరల్ ఎస్పీకి తన ఫిర్యాదులో పేర్కొంది.