ఫిరాయింపులు, ప్రాజెక్టులు, వెన్నుపోటు రాజకీయాలు: బాబును ఏకేసిన లక్ష్మీపార్వతి
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు డైరెక్ట్ పాలిటిక్స్ తెలియవని, ఆయనకు తెలిసిందల్లా వెన్నుపోటు రాజకీయాలేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఎద్దవా చేశారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్ చేపట్టిన మూడు రోజుల జలదీక్షకు సోమవారం ఆమె హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల మేలు కోసమే వైయస్ జగన్ ఆలోచిస్తున్నారని, ప్రజా సంక్షేమం కోసం ఆయన ఎన్నో దీక్షలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జననేత జగన్ ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉన్నారని, ప్రజలకు ఎప్పుడు దూరంగా లేరని ఆమె అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తుంటే వాటిపై ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడం దారుణమని అన్నారు. ఒక్క ప్రాజెక్టు కూడా కట్టని ఘన చరిత్ర చంద్రబాబుదని, స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.
ప్రజాధనం దుర్వినియోగం చేయడంలో చంద్రబాబు ముందున్నారని దుయ్యబట్టారు. ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్నారని, రాష్ట్రం రెవెన్యూ లోటుతో ఉందంటూనే ఎక్కడికి వెళ్లాలన్న విమానాల్లోనే వెళ్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలను కోట్లతో కోనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.
వైసీపీ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీకి వెన్నుపోటు పొడిచి ఫిరాయింపు ఎమ్మెల్యేలు మరో వెన్నుపోటుదారు వద్దకు వెళుతున్నారని మండిపడ్డారు. అవినీతికి పెద్దపీట వేయడంలో ముందున్న చంద్రబాబు నీచులతో కలిసి వైయస్ జగన్ను జైలుకు పంపారని దుయ్యబట్టారు.
అప్పటి హోం మంత్రి చిదంబరం కాళ్ల మీద పడి జగన్పై కేసులు బనాయించారని ఆరోపించారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్పై కూడా ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఎలా కొనాలా? అని లోకేశ్ ఆలోచిస్తున్నారని ఆమె విమర్శించారు.